భీష్ముడు


భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా దేవలోకం లో ఇంద్రునికి, విష్ణువుకు సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. మహాభారతం ప్రకారం సాక్షాత్తూ బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ప్రకృతి తత్వానికి ప్రతీకలు. ధర, అనిల, అనల, అహ, ప్రత్యూష, ప్రభాస, సోమ, ధృవులు.

ఒక సారి వారు తమ భార్యలతో కలిసి వనవిహారం చేస్తుండగా అరణ్యంలో ఒక దివ్య తేజస్సు గల ఆవు కనిపించింది. అది వశిష్టుని ఆశ్రమంలో ఉండే కామధేనువు. దానిని వారు దొంగతనంగా తీసుకుని వెళతారు. వశిష్ఠుడు తన దివ్యదృష్టి ద్వారా జరిగింది గ్రహించి వారిని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు. వారు వశిష్టుని క్షమించమని వేడుకోగా సహాయం చేసిన ఏడుమంది వసువులు భూమిపై కొద్ది రోజులు మాత్రమే జీవిస్తారని కానీ కామదేవుని తీసుకుని వెళ్ళిన అష్టమ వసువు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండక తప్పదని చెబుతాడు.

వారు ఆ శాపం గురించి ఆలోచిస్తుండగా గంగా దేవి వారి వద్దకు వస్తుంది. వారు ఆమెను మానవ రూపం ధరించి ఎవరైనా రాజును వివాహమాడి తమకు జన్మనిచ్చి పుట్టిన వెంటనే నదిలో పారవేయ వలసిందిగా కోరతారు. గంగాదేవి అందుకు అంగీకరిస్తుంది. ఒకనాడు చంద్రవంశానికి చెందిన ప్రతీపుడు అనే మహారాజు గంగానదీలో సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తుండగా గంగాదేవి అందమైన మానవకాంత రూపం ధరించి వచ్చి ఆయన కుడి తొడమీద కూర్చుంటుంది. ఆమె తనను మోహిస్తుందేమోనని ఆయన బాధ పడి ఆమె ఎందుకు అలా కూర్చుందో అడుగుతాడు. సాధారణంగా కూతుళ్ళు, కోడళ్ళు మాత్రమే అలా కూర్చుంటారు. తనకు కుమారుడు కలిగితే అతన్ని పెళ్ళాడవచ్చునని సూచిస్తాడు. అది విని ఆమె అంతర్ధానమైపోతుంది.

కొద్ది కాలానికి ప్రతీపునికి శంతనుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆయన ఒకసారి గంగాతీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్న ఆమెను చూసి మోహిస్తాడు. శంతనుడు ఆమెను పెళ్ళి చేసుకోవాలంటే కొన్ని షరతులు విధిస్తుంది. దాని ప్రకారం పెళ్ళి తర్వాత ఆమె ఏం చేసినా శంతనుడు అందుకు అడ్డు చెప్పకూడదు. ఆక్షేపించ కూడదు. అలా చేసిన పక్షంలో ఆమె అంతర్థానమైపోతుంది. శంతనుడు అందుకు అంగీకరించి ఆమెను పెళ్ళి చేసుకుంటాడు.

కొద్ది కాలానికి వారికి ఒకరి తర్వాత ఒకరు ఏడుగురు మగ సంతానం కలుగుతారు. అయితే ఆమె ఒక్కో బిడ్డ పుట్టిన వెంటనే నదిలో పారవేస్తూ ఉంటుంది. ఆ ఏడుగురి విషయంలోనూ ఎలాగోలా ఊరుకున్న శంతనుడు ఎనిమిదవ బిడ్డ విషయంలో మాత్రం ఆమెను వారిస్తాడు. ఆమె ఆ శిశువును శంతనుడికిచ్చి అంతర్ధానమైపోతుంది. ఆ శిశువే దేవవ్రతుడు. జీవితకాలం భూమి మీద జీవించాలన్న శాపానికి గురైన అష్టమ వసువు. గంగాదేవి జన్మనిచ్చింది కాబట్టి గాంగేయుడు అని కూడా పిలవబడ్డాడు.

సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహమాడాలని నిశ్చయించుకుని శంతనుడు సత్యవతి తల్లిదండ్రులను సంప్రదించాడు. అప్పటికే భీష్ముడిని పుత్రుడిగా కలిగిన శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి వారు నిరాకరించారు. దానితో మనస్తాపం చెందిన తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు. ఈ వివాహంకోసం సత్యవతి తల్లిదండ్రులు పెట్టిన అన్ని ఆంక్షలను అంగీకరించి, తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా అసలు వివాహమే చేసుకోనని భీష్మించి, తన తండ్రికి సత్యవతితో వివాహం జరిపించాడు. తన వివాహం కోసం ఇంతటి త్యాగానికి సిద్ధపడిన పుత్రుని అభినందించి, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు.

తన పిన తల్లికి కలిగిన సంతానం చిత్రాంగదుడు, విచిత్రవీర్యులకు తగిన కన్యల కోసం అన్వేషిస్తూ యుద్ధంలో ఇతర రాజులను ఓడించి కాశీ రాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలికలను తెస్తాడు. పెద్ద కుమార్తె అంబ మాత్రం తాను వేరే రాజ కుమారుడిని వరించానని చెబుతుంది. భీష్ముడు ఆమెను ఆ రాజు వద్దకు పంపిస్తాడు. ఆ రాజు యద్ధంలో తాను ఓడిపోయినందున ఆమెను స్వీకరించనని చెబుతాడు. ఆమె తిరిగి భీష్ముని వద్దకు వచ్చి యుద్ధంలో తనను గెలిచి తెచ్చాడు కాబట్టి వివాహం చేసుకోమని కోరుతుంది. తను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రమాణం చేసి ఉన్నందున భీష్ముడు అందుకు అంగీకరించడు.

ఆమె కోపంతో వెళ్ళి భీష్ముడి గురువైన పరశురాముణ్ణి శరణు వేడుతుంది. పరశురాముడు తన శిష్యుణ్ణి పిలిచి ఆమెను పెళ్ళి చేసుకోమంటాడు. ఆడిన మాట తప్పనంటాడు భీష్ముడు. యుద్ధం అనివార్యమౌతుంది. హెూరాహోరీగా పోరు కొనసాగుతుంది. తన శస్త్రాస్త్రాలతో పరశురామునే నిలువరిస్తాడు భీష్ముడు. చివరకు పరశురాముడు తన గండ్రగొడ్డలిని ప్రయోగిస్తాడు. భీష్ముడు పరశురాముడే అనుగ్రహించిన బ్రహ్మాస్త్రాన్ని ప్రయాగిస్తాడు. రెండూ ఢీకొంటే జగత్ప్రళయం తప్పదని భూదేవి వేడుకొనగా ఇద్దరూ తమ అస్త్రాలను ఉపసంహరించుకొంటారు. గురువును మించిన శిష్యుడివయ్యావంటూ పరుశురాముడు భీష్ముణ్ణి ప్రశంసిస్తాడు.