గొప్పమనసు


రాయవరం అనే చిన్న గ్రామం ఉంది. దాన్ని ఆనుకుని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి, నదిలో స్నానం చేసి వెళుతున్నారు. వారం పది రోజులపాటు గ్రామస్థులకు ఇదొక పెద్ద పండగ. ఆ సమయంలోనే, గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టిన రోజు పండగ వచ్చింది. అతడి భార్య భర్తను వేగిర పెడుతూ, “చీకటి పడకుండా వచ్చేయండి. దర్జీ ఈపాటికే అమ్మాయి పట్టు పరికిణీ కుట్టే వుంటాడు. అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి. అసలే ఊరినిండా జనం!" అని హెచ్చరించింది. అయితే, దశరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి, ఇంకా పరికిణీ పని పూర్తి కాలేదు. దర్జీ అతణ్ణి కొంచెంసేపు కూర్చోబెట్టి పని పూర్తిచేశాడు. అతడు పరికిణీ తీసుకుని బయలు దేరేసరికి చీకటి పడుతున్నది. దశరథయ్య ఇంటిని సమీపిస్తుండగా ఒక పాతికేళ్ళ కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటికి వస్తున్నాడు.

దశరథయ్య అతణ్ణి, ఏనాడూ చూసి వుండలేదు. ఆ కుర్రాడి బెదురు చూపులూ, కంగారు చూస్తూనే, దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది. అతడు పరుగునపోయి, వాడి మెడ పట్టుకుని, “నువ్వెవరు? ఇంట్లోంచి ఏం దొంగిలించావు?" అన్నాడు కరుకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, "దొంగవెధవా, నిజం చెప్పు. దొంగిలించిన వస్తువెక్కడ?" అంటూ పెద్దగా అరిచాడు. అది విని, అతడి భార్యా, కూతురే కాక పక్క ఇళ్ళవాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. "ఈ వయసులో కష్టపడి పనిచేసుకోక, దొంగతనాలకు దిగాడన్న మాట! నాలుగు తన్ని బుద్ధి చెప్పండి." అన్నాడొకడు అక్కడ చేరిన గుంపులో నుంచి."ముందు ఏం కాజేశాడో చూడండి." అన్నాడు మరొకడు. దశరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లరడబ్బు తప్ప మరేం లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి "నేను దొంగను కాదు. నన్ను వదిలిపెట్టండి" అన్నాడు.

“ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట. పుష్కరాలు గనక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి వుంటాడు!" అన్నదొకావిడ. గుంపులోంచి ఇద్దరు ముందుకు తోసుకు వచ్చి, కుర్రవాణ్ని కొట్టబోయేంతలో వాడు "అయ్యా, ఆగండి! ఇంట్లో దేవుడి మందిరం పక్కన వున్న ఎర్రసంచీ ముందు తీసుకురండి" అన్నాడు. నిదానంగా. సుమతి గలగలా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచీ తీసుకువచ్చింది. దాని నిండా గలగలలాడుతూ వెండి నాణాలున్నవి. దశరథయ్యకు ఆ సంచీ తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్ధం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకుని, "ఆ సంచీలో వెయ్యి వెండి కాసులున్నవి. ఆ సంచీని మీయింట్లో పెట్టింది, నేనే! ఎందుకు పెట్టానో చెప్పమంటారా?” అన్నాడు.

దశరథయ్యతోపాటు, అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడి కేసి చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. పన్నెండు సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తేనే గాని, పిల్లవాడు బతకడని చెప్పారు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగూరిలో అతడి చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు. అతడు తప్పక సాయం చేయగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అయితే, ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం, ఈ ఊరు వచ్చినట్టు తెలిసింది. కుర్రవాడి తండ్రి అక్కడి నుంచి అతడి కోసం, ఈ ఊరు వచ్చాడు. కాని, సాయంకాలం వరకూ తిరిగినా, అంతమంది తీర్థప్రజల్లో, ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు.

ఇక చేసేదిలేక తన గ్రామానికి బయలుదేరుతూ, దాహం తీర్చుకునేందుకు, ఊరి రచ్చబండకు ఎదురుగా వున్న, మండువా ఇంటికి వెళ్ళి, తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి, అతడికి మంచి నీళ్ళిచ్చి, తిరిగి తలుపు మూసింది. కుర్రాడి తండ్రి తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో, గడప దగ్గర విలువైనరాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి, తళుక్కుమంటూ అతడి కంట బడింది. అతడు దాన్ని తీసుకుని చూసి, తలుపు తట్టి, ఇంటి వాళ్ళకు ఇద్దామనుకున్నాడు. కాని, చప్పున తన కొడుకు స్థితి గుర్తుకు రాగా ఉంగరాన్ని జేబులో వేసుకుని, తన గ్రామం చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో, అతడు కొడుక్కు పట్నంలో వైద్యం చేయించి, ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడు ఇదంతా చెప్పి, దశరథయ్యతో, "అయ్యా, ఆ తర్వాత, మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయినా సాధ్యపడలేదు. ఐతే, నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయేముందు, మా నాన్న ఈ జరిగినదంతా చెప్పి, తన కర్మకాండకు ఖర్చు పెట్టవద్దనీ, ఇంట్లో వున్న ఎనిమిదివందల కాసులకు, మరి రెండువందలు ఎలాగైన చేర్చి, తమకు ఇవ్వవలసిందనీ చెప్పాడు. పోయిన మా నాన్నను గురించి, దొంగగా చెప్పడం మనస్కరించక, వెయ్యి వెండి కాసుల్ని రహస్యంగా, తమ ఇంట్లోని దేవుడి గది ముందు పెట్టాను. ఆ డబ్బు తమదే!" అన్నాడు. చేతులు జోడించి నమస్కరిస్తూ, కుర్రాడి నిజాయితీ చూసి, అక్కడ చేరినవాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. "సంగతేమిటో కనుక్కోకుండా, కనబడినవాళ్ళను పట్టుకుని దొంగ అంటూ కేకలు పెట్టడం, మర్యాదా!" అంటూ జనం దశరధయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే, దశరథయ్య తన కూతురు చేతిలో వున్న డబ్బు సంచి తీసుకోబోతూ "నీ పుట్టిన రోజున మంచి బహుమతి లభించింది.

ఆ డబ్బుతో నీకు బంగారు గొలుగు చేయిస్తాను." అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డు వచ్చి. "ఇంకా నయం! పసిపిల్ల వంటి మీద బంగారం వుండడం ప్రమాదం. ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను" అన్నది. సుమతి డబ్బు సంచీ వున్న చేతిని వెనక్కు లాక్కుని, తండ్రిని, “ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్నా?” అని అడిగింది. "నాకు ఆ మాత్రం గుర్తు లేదనుకోకు, తల్లీ! ఈ రోజుతో నీకు తొమ్మిది నిండి, పది వస్తాయి." అన్నాడు దశరథయ్య. "ఆ అబ్బాయి తీర్చిన బాకీ పన్నెండేళ్ళ కిందటిది. మనం, ఈ ఇల్లు కొన్న తర్వాత ఏడాదికి నేను పుట్టాను. అంటే, ఆ ఉంగరం, మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదన్నమాట! పిల్లలు సరిగా చూడక, ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో వున్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది. ఇది, తాతకు ఇచ్చి వస్తాను." అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య, అతడి భార్యా తమ కూతురి దయాగుణానికి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతురును అప్యాయంగా ముద్దాడి, "ఆ డబ్బు, తాతకు రేపు ఇవ్వవచ్చులే, తల్లీ! ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి.” అన్నది.

"ఈ రోజు గుడికి వెళ్ళకపోయినా ఫర్వాలేదు. తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది!" అంటూ సుమతి, రామయ్య తాత ఇంటికేసి పరుగుతీసింది. వయసులో చిన్నదయినా, తమ కూతురి గొప్ప మనసు చూసి, ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు.