అన్నదమ్ములు


అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ము లుండేవాళ్లు. రామయ్య పెద్దవాడు. తెలివిగలవాడు. సోమయ్య చిన్న వాడు అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ. అందుచేత గర్వంగా వుండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల. అందుచేత కొంచెం అణకువగా వుండేది. రామయ్య తన తెలివి తేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లూ, నాలుగెకరాల మెట్టచేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్దమేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం, సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిందాంట్లో తను కొంత తిని, మిగతాది ధర్మం చేస్తూ వుండేవాడు.

ఇలా వుండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి, రామయ్య ఇంటి కొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి ” ఎవరు నువ్వు? ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తడ్తున్నావూ ?” అని గద్దించాడు. అప్పుడు సన్యాసి “బాబూ, నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి. ఉదయాన్నే వెళ్లిపోతాను” అన్నాడు. ” ఏంటి, మా ఇం ట్లో వల్ల గాదు పో, పో. అదుగో, ఆ వున్నాడు షావుకారు. వాడి దగ్గరికి పో. దోవన యే సన్యాసిపోతున్నా పిలిచి అన్నం పెడతాడు.” అన్నాడు రామయ్య. యోగి పోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి, భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్కవేసి అతను నిద్రపోయిందాకా విసుర్తూ కూర్చున్నాడు.

సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన లేచి వెళ్లేటప్పుడు సోమయ్యనూ అతని భార్యనూ పిలిచి “మీకు మూడు వరాలిస్తాను. కోరుకోండి” అన్నాడు. సోమయ్య “స్వామీ, నాకు, నలుగురు ఇంటికివస్తే, ఉండటానికి పెద్ద ఇల్లూ, బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బూ ఇవ్వండి. అది చాలు” అన్నాడు. సోమయ్య పెళ్లాం “స్వామీ, నాకేమీ వద్దు. ఇతరులకు లేదనకుండా ధర్మం చెయ్యటానికి నాకు బుద్ధి పుట్టించు” అని రెండో వరం అడిగింది. మూడో వరంగా, సోమయ్య “స్వామీ, మాకు యెప్పుడూ ఇతరులకు మేలు చెయ్యాలనే బుద్ధి వుండేట్టుగా వరమివ్వండి” అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ వుంది. రామయ్య దబదబ పెళ్లాన్ని పిలుచుకుని మేడ దగ్గరకి పరుగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడూ తమ్ముడి భార్యా వున్నారు. రామయ్య “ఇది ఎలా వచ్చిందని తమ్ముణ్ణి అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య పెళ్లానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకు రమ్మని బలవంతపెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్లాడు. కొంతదూరం పోయే సరికి సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ, రోజుతూ “స్వామీజీ! రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది. ఈ మాటు మా ఇంటికి రండి. మిమ్మల్ని రాజులాగా చూస్తాము. నా భార్య కూడా మిమ్మల్నితీసుకురమ్మన్నది” అని బ్రతిమాలాడు. “బాబూ! ఏదో నా దోవను నేను తీర్థ యాత్రలకు పోతున్నాను. నేను రాలేను.” అన్నాడు సన్యాసి. “అలాగైతే ఎట్లా స్వామీ ! నా భార్య ఊరుకోదు. మీరు రాకపోతే కనీసం మా తమ్ముడి కిచ్చిన మూడు వరాలైనా ఇచ్చి వెళ్లండి.” అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకొని- “సరేలే నీకూ నువ్వు కోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తయి” అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో, గుర్రాన్ని మరీ వేగంగా పరుగెత్తిస్తూ ఇంటి వేపుకు బయలుదేరాడు. గుర్రం నోటివెంట నురుగులు కక్కుతూ, భూమిమీద కాళ్లు ఆనకుండా దౌడు తీస్తున్నది.

ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. “గుఱ్ఱం ఇంత త్వరగా పరుగెత్తుతున్నదే ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా?” అనుకున్నాడు. అనుకోవటంతోటే, గుఱ్ఱం క్రిందపడి చచ్చింది. రామయ్య గుఱ్ఱంతో పాటు కిందపడ్డాడు. పడి, లేచి దుమ్ము దులుపుకుని చచ్చిన గుఱ్ఱాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుఱ్ఱాన్ని వొదిలిపెట్టి వెళ్లడానికి బుద్ధి పుట్టలేదు. ఐనా ఏమిచేస్తాడు. వెళ్లకతప్పదు. “గుఱ్ఱం చావనే చచ్చింది. ఈ జీను వొదిలి పెట్టటం ఎందుకా” అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లేసరికి అతనికి జీను బరువేసింది. పెళ్లాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని “పాపమని, నన్ను యోగికోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం!” అని అనుకున్నాడు. ఇతను అనుకోవటమేమిటి, ఆ జీను మాయమవటమేమిటీ వొక్కసారే జరిగినై. రామయ్య మూడింట్లో రెండు వరాలు ఇలా వూరికే పోగొట్టుకుని కాళ్ళీడ్చు కుంటూ ఇంటికివచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని వున్నది. ఆమె నెత్తిమీద జీను ఆమె రామయ్యని చూడగానే మండి పడుతూ, ‘ఏమిటిదీ ? ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తిమీదికి ?” అని అడిగింది.

రామయ్య కప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ” ఇదుగో, జరిగిన పొరబాటేదో జరిగిపోయింది. నువ్వు వోర్పుగా జీను మోస్తూవుండు. మనదగ్గర ఇంకోవరం మిగిలివున్నది. దీంతో మనం యేదైనా మంచివరం కోరుకుని ధనవంతులమయి హాయిగా వుందాం.” అన్నాడు. ఈ మాటలు వినేవరకు అతని పెళ్ళాం మండిపడింది. ” నువ్వూ నీ డబ్బూ పోయి గంగలో పడండి తర్వాత. ముందు నా నెత్తిమీది జీను దించు. లేకపోతే బాగుండదు చెప్తున్నాను” అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి “జీను వూడిపోవాలి” అని కోరుకున్నాడు. జీను వూడి క్రిందపడ్డది. చూశారా! రామయ్య దుర్భుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినవి.