జీవ దేవుడు



భర్త రాము పనీపాటా లేకుండా తోటలో కూర్చుని ఉండటం చూసిన అంజలికి చిర్రెత్తుకొచ్చింది. చిరాకుపడుతూ భర్తను పిలిచి, ‘ఏమయ్యా! పగటి కలలు కనడం కట్టిపెట్టి, పట్టణానికి వెళ్లి ఈ వారానికి సరిపడే సరుకులు తీసుకుని రా’ అని చెప్పింది. రాము పళ్లు కొరుక్కుంటూ, చేసేదేమీ లేక పట్టణానికి బయలుదేరాడు. తోటి గ్రామీణులకు మల్లే అతడు కష్టజీవి కాదు. అడ్డదారుల్లో డబ్బు సాధించడం ఎలా అంటూ రోజంతా మల్లగుల్లాలు పడుతూ ఉండేవాడు. పట్టణానికి వెళ్లేటప్పుడు రాము ఊరి బయట నది దాటవలసి వచ్చింది. ఏటికి ఆవతల ఒడ్డున గట్టు పొడవునా దట్టంగా చెట్లు పెరిగాయి. చెట్లవరుసలో నడుస్తుండగా రాము పెద్ద చింతచెట్టు చూశాడు. అతడి మనస్సులో పలు ఆలోచనలు రేగాయి. కొద్ది రోజుల క్రితం పట్టణంలో ఒక కలప వ్యాపారి రాముతో మాట్లాడుతూ తనకు అత్యవసరంగా చింతకలప కావాలని, మంచి ధర చెల్లిస్తానని చెప్పాడు. ఆ మాటలు గుర్తుకు రాగానే రాముకు మెరుపులా ఒక ఆలోచన తట్టింది. ఈ చింతచెట్టు ఏటికి సమీపంలో గట్టుపై ఉంది. అక్కడ దాన్ని నరికి ముక్కలు చేసినట్లయితే, కలప గిడ్డంగికి తీసుకుని పోతే భారీగానే డబ్బు ముట్టవచ్చు. తాను పట్టణం వెళ్లాలనే విషయం మర్చిపోయి, అతడు అక్కడే నిలబడి పథకం పన్నాడు.

ఈ పనికోసం తన స్నేహితుడు గోపీ సహాయం తీసుకోవాలని అనుకున్నాడు. రాము చేసే తప్పు పనులన్నింటిలో అతడూ భాగం పంచుకునేవాడు. చెట్లు కొట్టడంలో అనుభవం ఉన్న కాలయ్య సహాయం తీసుకోవాలని అతడు భావించాడు. రాబోయే పున్నమి రాత్రి కాలయ్య చెట్టును కొడతాడు. గోపీ ఎద్దుల బండిని, కూలీని పిలుచుకు వస్తాడు. చెట్టును కోసి ముక్కలు చేసిన తర్వాత తెల్లారకముందే వాటిని బండిలో వేసుకుని కలప గిడ్డంగికి తీసుకుపోతారు. కలప వ్యాపారి నుంచి డబ్బు తీసుకుంటాడు. ఈ పనిలో సాయపడిన వారికి తలా కొంత పంచి మిగిలిన సొమ్ముతో ఇంటికి వస్తాడు.. అలా ఆలోచిస్తూ భుజాలు ఎగరేశాడు రాము. అనంతరం పట్టణం వెళ్లి కలప వ్యాపారిని కలిశాడు. తాను తెచ్చి ఇచ్చే కలపకోసం మంచి బేరం మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత గోపీని, ఇతరులను సంప్రదిం చాడు. తను వేసిన పథకాన్ని వారికి చెప్పాడు. వారందరూ చేరి మాట్లాడుకుని చేయవలసిన పనిని ఖరారు చేసుకున్నారు.

సమయం రానే వచ్చింది. రాముకు మనసులో ఉత్సాహం పొంగి పొరలుతోంది. చింతచెట్టు పడగొట్టే శుభదినం ఈరోజే మరి. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో వారంతా ఉత్సాహంగా ఉన్నారు. సాయంత్రానికి కారుమేఘాలు కమ్ముకు న్నాయి. చీకటిపడేవేళకు మెరుపులు మెరిసాయి. త్వరలోనే వర్షం ధారగా కురవసా గింది. రాత్రి భోజనం ముగించుకున్న రాము పథకం ప్రకారం చింతచెట్టు వద్దకు ప్రయాణమయ్యాడు. చెట్టు కొట్టే కాలయ్య చెట్టువద్దే అతడిని కలుసుకుంటాడు. ఇతరులు కూడా అర్థరాత్రి నేరుగా అక్కడికే వచ్చి కలుస్తారు. అలా ఆలోచించుకుంటూ, వర్షాన్ని లెక్కచేయకుండా రాము నదికేసి బయలుదేరాడు. నది సమీపంలో కనుచూపు మేరలో ఎవరూ కనపడలేదు. రాము పెద్దగా నిట్టూర్చాడు. ఎవరయినా తను చేస్తున్న పని చూసి గ్రామపెద్దకు చెపితే తను పెద్ద చిక్కులో పడతాడు మరి. వర్షం రాము ముఖాన్ని ఈడ్చి కొడుతోంది. మెల్లగా అతడు నదిని దాటసాగాడు. నదిలో మోకాలిలోతు నీళ్లు పారుతున్నాయి. సరిగ్గా నది మధ్యలో నడుస్తుండగా కాస్త దూరంలో అతడికి పెద్దగా శబ్దం వినిపించింది. రాము ఎడమవైపు తిరిగి చూశాడు. నది ఎగువ నుంచి నీళ్లు తన్నుకొస్తున్నాయి. ‘దేవుడా, అది అటవీ ప్రాంత నది. ఎగువన వర్షం పడిందంటే వెంటనే నదికి వరద ముంచుకొస్తుంది’ ఈ విషయం తల్చుకోగానే రాము వణికిపోయాడు. ప్రాణం కాపాడుకోవడానికి పరుగు పెట్టాడు. నది గట్టుకు అడుగు దూరంలో ఉండగానే రాము వరదలో చిక్కుకున్నాడు. నీళ్ళు ఒక్క సారిగా ఎత్తి కుదేశాయి. రాము పెనుకేక పెట్టాడు. ‘దేవుడా! నన్ను కాపాడు.’ ఉన్నట్లుండి దూలం వంటి వస్తువుపై పోయిపడ్డాడు. దాన్ని రెండు చేతులతోనూ పట్టుకున్నాడు. అమ్మయ్య. వరద ప్రమా దం నుంచి గట్టెక్కినట్లే… కాసేపయ్యాక తను ఒక చెట్టును పట్టుకుని ఉన్నట్లు అర్థ మయింది. వరదనీటిలో కొట్టుకు పోకుండా తనను కాపాడింది ఈ చెట్టే మరి. నెమ్మదిగా అతడు చెట్టుపైకి ఎక్కి కూర్చుండిపోయాడు.

కనుచూపుమేరా ఎవరూ కనపడలేదు. తన మిత్రుడు గోపీ, చెట్లు కొట్టే కాలయ్య, పనివాడు ఎక్కడా కనపడలేదు. వాళ్లు తెలివిగా ఉండి నది దాటి రాకుండా ఉండిపోయారేమో! ఆ రాత్రంతా తను చెట్టుమీదే ఉండాలని రాము గుర్తించాడు. వేరే మార్గం లేదు. కాసేపయ్యాక వరదనీటిలో ఒక శరీరం కొట్టుకు వస్తున్నట్లు చూశాడు. అతడొక అబ్బాయి. ఒక్కసారిగా రాము అతడిని చెట్టుపైకి లాక్కున్నాడు. త్వరలోనే ప్రాణంతో నిలిచిన కొన్ని మేకలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. రాము వాటిని కూడా కాపా డాడు. ఆ అబ్బాయి గొర్రెల కాపరి. నదికి సమీపంలో ఉండే అతడి గుడిసె వరదనీటిలో కొట్టుకుపోయింది. రాము, గొర్రెల కాపరి, మేకలు రాత్రంతా ఆ చెట్టు మీదే ఉండిపోయారు. వరద నీరు మరికాస్త ఎత్తులో వచ్చి ఉంటే చెట్టు సైతం కొట్టుకుపోయేది. కాసేపయ్యాక, వర్షం ఆగిపోయింది. వరద కూడా తగ్గుముఖం పట్టింది. తర్వాత తెల్లారిపోయింది. రాము తానెక్కడ ఉన్నాడో గమనించాడు. ఆశ్చర్యం. తాను నరికివేయాలనుకున్న చింతచెట్టు మీదే ఉన్నాడతను. ఆ చెట్టుకొమ్మల్నే తెగ నరికి డబ్బు కోసం దాన్ని తెగనమ్ముకోవాలని పథకమేశాడు తను. మరి ప్రతిగా ఆ చెట్టు తనకేమిచ్చింది? భయంకరమైన ప్రమాద పరిస్థితిలో అది తనకు నీడనిచ్చింది, ప్రాణం కాపాడింది. అతడి కను కొనుకుల నుంచి కన్నీళ్లు కారాయి. అతడు మెల్లగా గొణుక్కొన్నాడు. ‘వృక్షరాజమా! నేను నీపట్ల క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించాను. నన్ను క్షమించు!’ సహజసిద్ధంగానే తను సోమరీ, స్వార్థపరుడూనూ. కాని ఆ కాళరాత్రి తను ఒక అబ్బా యిని’, మేకలను కాపాడాడు. నిజంగా అది తన జీవితంలో ఎన్నడూ చేయని మంచి పని. తనవంటి క్రూరుడికి ఆశ్రయమిచ్చిన చింతచెట్టు ప్రభావంతో తను కూడా మంచి పని చేసి మనిషిగా మారాడు. ఈ ఆలోచన రాగానే రాము మనసు తేలికైంది. చింత చెట్టును కావిలించుకుని గొణిగాడు. ‘కృత జ్ఞతలు. ఇన్నాళ్ళూ పశువులా వ్యవహరించాను. నన్ను మనిషిగా మార్చావు!’ఉన్నట్లుండి అతడికి మనుషుల స్వరాలు వినిపించాయి.

తన భార్య అంజలి, మరి కొందరు గ్రామస్తులు చెట్టువద్దకు పరుగెత్తి వస్తుండటం చూశాడు. రాము రాత్రంతా ఇంటికి రాకపోవడంతో అంజలి కలవరపడిపోయింది. కొంతమంది గ్రామస్తులను తీసుకుని అతడిని వెతుకుతూ వచ్చింది. అతడు క్షేమంగా ఉన్నాడని తెలియగానే ఆమెకు సంతోషం పట్టలేకుండా పోయింది. గత రాత్రి తాను చావుబతుకుల మధ్య ఎలా కొట్టుకులాడిందీ రాము వివరించి చెప్పాడు. వరద ముంపునుంచి బయటపడ్డమే గొప్ప అదృష్టమని అన్నాడు. అంజలి చెప్పింది. ‘అవును భవానీ మాత దయవల్లే నీవు బతికి బయటపడ్డావు. మనం ఆ తల్లికి మొక్కుకుందాము. ‘ ‘వద్దు అంజలీ, ఈ దేవతే నన్ను కాపాడింది,’ అంటూ రాము చింతచెట్టు కేసి చూపించాడు. ‘ఇది సజీవరూపంలోని దేవుడు. నేను బతికి బట్టకట్టడానికి ఎవరికయినా కృతజ్ఞత చెప్పుకోవలసి వస్తే ఈ హరిత దేవుడికే చెప్పుకోవాలి. ఇకపై నేను పచ్చని చెట్లను ఎన్నటికీ పడగొట్టనని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఇతరులు ఎవరయినా చెట్లు నరకడాన్ని కూడా నేను అడ్డుకుంటాను. తర్వాత అతడు చింతచెట్టు ముందు మోకరిల్లి ప్రార్థించాడు.