దుష్టులకు దూరం


జనార్ధనం తండ్రి వ్యాపారరీత్యా ఒక పెద్ద పట్నంలో ఉండేవాడు. ఆయన జనార్థనానికి బోలెడు డబ్బు కూడబెట్టి ఈయడమే కాక, పోయేటప్పుడు, "నాయనా జనార్థనం, నేను పోయాక నువ్వీ పట్నంలో ఉండవద్దు. ఏదైనా మంచి చోటు చూసుకుని స్థిరపడు. నేను సంపాదించినది నువ్వూ నీ పిల్లలూ పది కాలాల పాటు కష్టపడకుండా తినగలిగినంతవుంది." అని చెప్పి కన్నుమూశాడు. తండ్రి పోయాక జనార్థనానికి ఒక సమస్య పట్టుకుంది. ఎక్కడ స్థిరపడాలన్నది వాడికి తోచలేదు. స్వంత ఊరిలో వాణ్ణి ఆప్యాయంగా ఆదరించే వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆ ఊరు అట్టే మంచిది కాదు. నీటి సౌకర్యం సరిగా ఉండదు. ప్రకృతి దృశ్యాలు ఉండవు. అంతా రాతి ప్రదేశం! జనార్ధనం ఆస్తిని కొంత బంగారం గానూ, కొంత నగదుగానూ మార్చుకుని, మంచి చోటు వెతుక్కుంటూ బయలుదేరాడు.


పక్షం రోజుల తరువాత వాడికొక చక్కని ప్రదేశం నచ్చింది. సముద్రపు ఒడ్డున చిన్న పల్లెటూరు! సరుగుడు తోటలు, ఇసక దిబ్బలు. ఆ చల్లని ప్రశాంత వాతావరణం జనార్ధనాన్ని ఎంతగానో ఆకర్షించింది. వాడు సరుగుడు తోటలో చిన్న పాక వేసుకుని, అక్కడే స్థిరపడ్డాడు. రోజూ సాయంత్రం వాడొక చిన్న నాటు పడవలో సముద్ర విహారానికి వెళ్ళేవాడు. ఆ పల్లెటూళ్ళో ప్రజలందరి ముఖ్యవృత్తి చేపలు పట్టటం. వాళ్ళకు ఏమీ కష్టపడకుండా తిని కూర్చునే, ఈ కొత్తగా వచ్చిన మనిషిని చూస్తే అసూయగా ఉండేది. ఒక రోజు ఎండవేళ జనార్థనం ఇంటి ముందున్న సరుగుడు చెట్టు కింద మంచం వేసుకుని పడుకున్నాడు. అవతల ఎండ నిప్పులు చెరుగుతున్నా, ఆ సరుగుడు తోటలో చల్లగా గాలి వీస్తోంది. ఎవరో పిలిచినట్లయి, జనార్ధనానికి మెలకువ వచ్చింది. మంచం దగ్గర ఒక మనిషి నిలబడి ఉన్నాడు. పొడువాటి రాగి రంగు గడ్డమూ, నున్నని గుండూ వాడు ఎర్రరంగు పొడుగు చేతుల అంగీ, నల్లనిపంచె ధరించి ఉన్నాడు. వాడి మెడలో కాకి ఈకల దండ ఉంది. వాడి కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాడు, “కుర్రాడా, చెంబెడు మంచి నీళ్ళు పట్రా! దాహంగా వుంది. ఎండలు మాడ్చేస్తున్నాయి. అన్నాడు జనార్థనంతో. జనార్ధనం మంచి నీళ్ళు తేవటానికి లోపలికి వెళ్ళబోయాడు.

“ఆగు, కుర్రాడా! చిక్కటి మజ్జిగలో చిటికెడు ఉప్పేసి పట్టుకురా! నా నోరు పిడచగట్టుకు పోయింది." అన్నాడా మనిషి. జనార్ధనం "అలాగే" అని వెళ్ళబోయాడు. “దాంట్లో ఒక నిమ్మకాయ కూడా పిండు, రుచిగా ఉంటుంది." అని కేక పెట్టాడా గడ్డపుమనిషి. జనార్ధనం ఆ మనిషి అడిగినట్లు గానే ఒక గిన్నెలో ఉప్పు, నిమ్మకాయ రసమూ వేసిన మజ్జిగ పట్టుకొచ్చాడు. ఆ పాటికి, ఆ మనిషి, జనార్థనం వేసుకున్న మంచం మీద కూర్చుని తాపీగా కూనిరాగాలు తీసుకుంటున్నాడు. వాడు గుటగుట మజ్జిగ తాగేసి, "గిన్నె నిక్షేపంలా ఉంది. ఎవరయినా కాజేయగలరు, లోపల దాచిరా!" అన్నాడు. జనార్థనం గిన్నె లోపల పెట్టి వచ్చేసరికి, ఆ మనిషి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. "మంచి ఎండ వేళ కదూ, నిద్ర ముంచుకు వస్తోంది ఒక కునుకు తీసి లేస్తాను" అని క్షణంలో ఆ మనిషి గుర్రు పెట్టసాగాడు. జనార్థనం ఏమీ అనలేక పోయాడు. వాడు ఇంటి అరుగు మీద కూర్చుని, సాయంత్రం దాకా కాలక్షేపం చేశాడు. చీకటి పడ్డాక ఆ మనిషి లేచి ఆవులిస్తూ, "అప్పుడే చీకటి పడిపోయింది. ఒంటరి జీవితమై పోయింది. ఇంట్లో దీపం వెలిగించే దిక్కుకూడా లేదు." అంటూ తిన్నగా పాకలో కెళ్ళి, గూట్లో దీపం వెలిగించాడు. వాడి అతి చనువుకు జనార్ధనానికి చిరాకు వేసింది. "బాగా చీకటిపడి పోయింది. ఇక నువ్వు వెళ్ళవచ్చు." అని కోపాన్ని దిగమింగుతూ అన్నాడు. ఆ మనిషి జనార్ధనాన్ని ఎగాదిగా చూసి, "ఎవడివయ్యా, నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నే దబాయిస్తావా? వెళ్ళు, వెళ్ళు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి తెల్సిందా?" అంటూ జనార్ధనాన్ని అవతలకు నెట్టి, తలుపు మూసుకున్నాడు. ఆ రాత్రంతా జనార్థనం, తలుపు బాదుతూ అవతలే ఉన్నాడు. ఆ మనిషి, “నా ఇంటి తలుపులు బద్ధలవుతే నువ్వే డబ్బు లిచ్చుకోవాలి.” అనేసి నిద్ర పోయాడు. కొంత సేపటికి తెల్లవారింది. ఊరి వాళ్ళు చేపల వేటకి బయలుదేరారు. జనార్ధనం వాళ్ళందరినీ పిలిచి, “ఈ అన్యాయం చూడండి." అంటూ జరిగినదంతా చెప్పాడు.

ఇంతలో ఆ మనిషి తలుపు తీసుకుని వచ్చి, “వీడెవడో పిచ్చివాడిలా ఉన్నాడు. నా ఇంటిని పట్టుకుని తన ఇల్లంటూ రాత్రంతా ఒకటే రచ్చ!" అన్నాడు. జనార్ధనానికి ఆవేశం వచ్చి, “మీరే చెప్పండి. ఈ ఇల్లు నాదా, వాడిదా? మీరంతా రోజూ వస్తూ పోతూ నన్ను చూడటంలేదూ? ఈ దొంగపీనుగకి బుద్ధి చెప్పండి." అన్నాడు కోపంగా. ఊరి వాళ్ళంతా జనార్థనాన్ని కిందనుంచి పైదాక తేరిపార చూసి, “ఎవడివిరా నువ్వు? చూస్తే దొంగవిలా ఉన్నావు. ఈ ఇల్లు ఈ గడ్డపాయనదే! మేం రోజూ ఇతన్నే చూస్తున్నాం. మేం ఇప్పటిదాకా నిన్ను చూసిన పాపాన పోలేదు. మర్యాదగా నీ దారిన నువ్వుపో, లేకపోతే ఎముకలు విరిగేలా తంతాం!" అని జనార్థానాన్ని దబాయించారు. జనార్ధనం నిర్ఘాంతపోయాడు. ఊరివారంతా తన మీద అసూయతో, తన ఆస్తి కాజేయాలనే దురుద్దేశంతో ఈ నాటకం ఆడుతున్నారని వాడు గ్రహించాడు. వాడు రెండుసార్లు గట్టిగా తల విదిలించి వెర్రి చూపులు చూస్తూ, “మీరు నా కళ్ళు తెరిపించారు.

ఇన్నాళ్ళూ ఈ ఇల్లు నాదనుకున్నాను. అయితే నేను పెట్టెలో పెట్టి దాచిన బంగారం కూడా నాది కాదా?" అని అమాయకంగా వాళ్ళని అడిగాడు. వాళ్ళు జనార్థనం మతి కోల్పోయాడని రూఢి పరుచుకుని, “నీది కాదు. ఆ బంగారం అంతా మాది. అది ఎక్కడదాచావో త్వరగా చెప్పు" అంటూ అత్రుతగా వాణ్ణి అడిగారు. జనార్థనం దూరంగా వున్న ఎత్తైన ఇసకదిబ్బను చూపించి, “పెట్టెడు బంగారం ఇసకదిబ్బలోనే ఉంది." అన్నాడు. అంతా ఎవరికి వారే కాలిసత్తువ కొద్దీ ఆ వైపుకి పరిగెత్తారు. ఆ బంగారం ఎవరికి వారే తమ సొంతం చేసుకోవాలని ఆత్రం. గడ్డంమనిషితో సహా అందరూ ఇసకదిబ్బ వైపుకి పరిగెత్తి పోగానే, జనార్థనం తేలిగ్గా నిట్టూర్చి, సరుగుడు చెట్టు మొదట్లో పాతి పెట్టిన బంగారం ఉన్న పెట్టెను తీసుకుని, అప్పటి కప్పుడు నాటు పడవలో బయలుదేరి ఆ దుష్టులకు దూరంగా వెళ్ళిపోయాడు. మంచి చోటు అని తండ్రి అనటంలో అసలు అర్థం మంచి మనుషులున్న చోటని జనార్థనం తెలుసుకుని, తమ సొంత ఊరు వెళ్ళిపోయి, తనని ఆదరించే వారి మధ్య ఆనందప్రదం అయిన జీవితం గడిపాడు.