పారిపోయిన దొంగ


వీధి తలుపు చప్పుడు కావడంతో, వంటగదిలో ఉన్న రమ వచ్చి తలుపు తీసింది. ఆ పాటికే బాగా చీకటి పడింది. అవతల ఉన్న మనిషి ఆమెను తోసుకుని లోపలికి వచ్చి, చప్పున తలుపుమూసి, “అరిచావంటే పీక నులిమేస్తాను. అన్నింటికీ తెగించాను! ఖైదులో నుంచి పారిపోయి వస్తున్నాను!" అన్నాడు కరకుగా. వీధి వెంట నలుగురు మనుషులు పరిగెత్తిన శబ్దం అయింది. వాళ్ళు దొంగను తరుముకుంటూ వస్తున్న రక్షక భటులు. వాళ్ళను దూరం కానిచ్చి, రమ నవ్వుతూ, “చెరసాలలో సుఖంగా కాలం గడపక, ఏం బావుకుందామని పారిపోయి వచ్చావు?" అని దొంగను అడిగింది. దొంగ కోపంగా, “ఆ విషయం నీకు అనవసరం. ఇంట్లో ఇంకా ఎవరు ఉన్నారు?" అని అడిగాడు.

"నీ కేమీ భయంలేదు. నేను ఒంటరిగానే ఉన్నాను. వంట సగం అయింది. వంట గదిలోకి వస్తావా?" అంటూ దారితీసింది రమ. దొంగ ఆమె వెనకనే వంటగదిలోకి వెళ్ళి, ఆమె వేసిన పీటమీద కూర్చున్నాడు. రమ వంకాయలు తరుగుతూ కళ్ళనీళ్ళు పెట్టుకుని, కొంగుతో తుడుచుకున్నది. "నేను నిన్ను ఏమీ చెయ్యలేదే? ఎందుకు కన్నీళ్ళు?" అని దొంగ అడిగాడు. "నిన్ను చూస్తే మా అన్న గుర్తుకు వచ్చాడు. వాడు ఆవేశంలో ఎవరినో కొట్టి, ఖైదు అయ్యాడు. అయితే ఒక రాత్రి నీలాగే పారిపోయి వచ్చాడు. వచ్చిన క్షణం నుంచీ వాడికి శాంతి లేదు! నిద్రలేదు! అన్న హితవు లేదు! ఇల్లు కదలాలంటే భయం! బయట ఏ చప్పుడు వినిపించినా రక్షకభటులు వస్తున్నారని భయం! పిచ్చివాడిలా తయారయినాడు. శిక్ష పూర్తిగా అనుభవించి వస్తే ఇలాంటి భయాలు ఉండవు. ధైర్యంగా కొత్త జీవితం ఆరంభించవచ్చును. ఆ మాట నేను చెప్పాను. వాడు వినలేదు. పది రోజులపాటు ఇంట్లోనే అజ్ఞాతవాసం చేశాడు. పదో రోజు రాత్రి హఠాత్తుగా రక్షకభటులు వచ్చారు. భయంతో ఆలోచించకుండా మేడ మీదినుంచి దూకేసి, దెబ్బలు తగిలి, రెండు రోజుల అనంతరం చచ్చిపోయాడు." అంటూ రమ కథ ముగించింది. దొంగ ఆమెను చూసి జాలిపడుతూ, "గొంతు తగ్గించు! ఎవరైనా రాగలరు!" అన్నాడు.

“వంట అయింది భోజనం చేస్తావా?" అన్నది రమ. దొంగకు తినాలనే ఉన్నదిగాని సందేహించాడు. "ఇందులో విషం కలపలేదులే! నీ ఎదుటేగా వంట చేశాను?" అంటూ రమ దొంగ ముందు అన్నం, కూరలూ వడ్డించింది. వాడు భోజనం చేస్తుంటే రమ. “చూడబోతే మంచివాడివిలాగున్నావు! చెరసాలలో ఎలా పడ్డావు?" అని అడిగింది. దొంగ ఇలా చెప్పాడు. “నా తల్లిదండ్రులెవరో నాకు తెలీదు. ఒక అవ్వ నన్ను పెంచి, పెద్దచేసింది. నన్ను గారాబంగా పెంచడానికి తాను అష్టకష్టాలూ పడింది. ఆమె పోయాక నా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాకు చదువు లేదు. మా పల్లెలో పనిలేక పట్నం వచ్చాను. ఏ పనీ ఇచ్చినవారు లేరు. నాలుగు రోజులు తిండిలేదు. ఆకలి బాధకు తాళలేక, ఒక వ్యాపారస్థుడి చేతిలో ఉన్న సంచీ లాక్కుని,పారిపోయి పట్టుబడ్డాను. రెండు నెలలు శిక్ష పడింది.” "అలానా పాపం! మరి ఇప్పుడు పారిపోయి ఎందుకు వచ్చావు?" అని రమ అతన్ని అడిగింది.

“అక్కడ అడ్డమైన చాకిరీ చెయ్యాలి. పెద్ద ఎత్తున వంటలు చెయ్యాలి. తోట పని చూడాలి, బట్టలు పిండాలి. చాపలూ, దుప్పట్లూ నేయాలి. బట్టలు కుట్టాలి ఇలా ఎన్నో రకాల పనులు! అవన్నీ చేసే ఓపిక నాకు లేదు." అన్నాడు దొంగ విసుక్కుంటూ. రమ నవ్వి, "బయట పని దొరకలేదని, దొంగతనం చేసి, చెరసాలకు వెళ్ళావు! అక్కడ పని ఎక్కువ అని దొంగతనంగా పారిపోయి వచ్చావు! ఇప్పుడు ఏం చేస్తావు?" అని అడిగింది. దొంగ జవాబు చెప్పలేక తల దించుకున్నాడు. రమ మళ్ళీ ఇలా అన్నది. “ఇప్పటినుంచీ నీకు నరకబాధలు ప్రారంభమవుతాయి, నిద్రాహారాలుండవు! భయం నిన్ను నీడలా అంటి పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఎలా బతుకుతావు? ఉద్యోగం ఎలా దొరుకుతుంది? నీ కిప్పుడు జైలులో ఉన్న స్వేచ్ఛ కూడా లేదు. పారిపోయివచ్చి నీ ఖైదు శిక్షను పెంచుకున్నావు. అంతే! ఆ చెరసాలలోనే ఏ వంటలు చెయ్యడంలోనో, బట్టలు కుట్టడంలోనో, దుప్పట్లు నెయ్యడంలోనో, తోటపనిలోనో ప్రావీణ్యం సంపాదించి ఉంటే, విడుదల అయివచ్చాక, నీ బతుకు నువ్వు స్వతంత్రంగా, గౌరవంగా బతికే మార్గం దొరికేది. అక్కడ నీకు శిక్షతోబాటు ఏదో వృత్తిలో శిక్షణ కూడా దొరుకుతుంది! నువ్వు చాలా తెలివితక్కువ పని చేశావు పారిపోయి వచ్చావు!"

దొంగకు కళ్ళు తెరుచుకున్నాయి. అతను తాను చేసిన పొరపాటు గ్రహించాడు. "నిజమే! పొరపాటు జరిగిపోయింది. దీన్ని దిద్దుకోవడమెలాగ? అని అతను రమను అడిగాడు. "మించిపోయిందేమీ లేదు. నీ అంతట నువ్వే చెరసాలకు వెళ్ళి, పట్టుబడు. అలా చేస్తే నిన్ను దండించరు! కొద్దిగా నీ శిక్ష పెరగవచ్చు. పని నేర్చుకోడానికి అదీ మంచిదే!" అన్నది రమ. దొంగ సంతోషంగా, “సొంత చెల్లెలు లాగా మంచి సలహా చెప్పావు. నీ ఋణం తీర్చుకోలేను. వస్తా!" అని, వెళ్ళిపోయాడు. దొంగ వెళ్ళిన కొంత సేపటికి మళ్ళీ తలుపు చప్పుడు వినిపించింది. ఈ సారి వచ్చినవాడు రమ తండ్రి. "ఎప్పుడూ లేంది, ఇంత ఆలస్యం అయిందేం, నాన్నా?" అని రమ తండ్రిని అడిగింది. “చెరసాల నుంచి ఒక దొంగ పారిపోయాడు. అందుకే ఆలస్యం అయింది." అన్నాడు తండ్రి. ఆయన చెరసాల అధికారి. "మీరు ఖైదీలను చూసే తీరు అలా ఉంటుంది! చెరసాల కేవలమూ ఖైదీలను శిక్షించటానికే కాదు, వాళ్ళలో పరివర్తన కలిగించేదిగా కూడా ఉండాలి. మీ చెరసాల నుంచి పారిపోయిన దొంగ మన ఇంటికే వచ్చాడు. నేను ఆ దొంగలో ఉన్న దొంగను పారదోలాను. అందుకోసం ఒక అన్నయ్యను కూడా కల్పించాను." అంటూ రమ జరిగినదంతా చెప్పింది. "భేష్! చెరసాల అధికారి కూతురివి అనిపించుకున్నావు! అతను చెరసాల చేరాడో, లేదో చూసి వస్తాను." అంటూ ఆయన లేచాడు. "ఆ భయం నీకు వద్దు. చెప్పానుగా, అతనిలో దొంగ పారిపోయాడు! భోజనం చేసి నిదానంగా వెళ్ళవచ్చు నువ్వు అన్నది రమ.