అద్దం


రామాపురంలో వజ్రగుప్తుడనే ధనిక వర్తకుడుండేవాడు. అతనికి సోమదత్తుడనే కొడుకు వుండేవాడు. సోమత్తుడు గారాబంగా పెరగడం వల్ల యుక్త వయసు వచ్చేసరికి సోమరిగా, వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యవనాలకు డబ్బును మంచినీరులా ఖర్చు చేస్తుండేవాడు.

కొడుకును మార్చడానికి వజ్రగుప్తుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ సమయంలో హిమాలయాలనుంచి ఒక ముని రామాపురానికి వచ్చాడు. ముని ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కార మార్గాలను సూచించే వాడు ముని మహిమ గురించి తెలుసుకు వజ్రగుప్తుడు అతనిని తన ఇంటికి పిలిపించి తన కొడుకు ప్రవర్తన గురించి చెప్పి, బాధపడ్డాడు. ముని వజ్రగుప్తుని కొడుకుతో "నాయనా ఏ పని చేయకుండా కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి. అలాగే ఉన్న ధనాన్ని వ్యసనాలకు వినియోగిస్తే ఏమీ మిగలదు. నీ తండ్రి చేసే వ్యాపారంలో పాల్గొని, మంచిపేరు తెచ్చుకో" అని హితవు పలికాడు.

ఆ మాటలకు సోమదత్తుడు "స్వామీ..! మా తండ్రి లెక్కలేనంత ఆస్తి సంపాదించాడు. అందువల్ల నేను సంపాదించాల్సిన అవసరం లేదు కదా అలాగే ఉన్న ధనాన్ని అనుభవించడంలో తప్పేముంది?" అని సమాధానం చెప్పాడు. అప్పుడు ముని సోమదత్తుడి వైపు "చూస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా సంచినుంచి ఒక పాట్లం తీసి "నాయనా.. సాయిబాబా గుడినుంచి తీసుకొచ్చిన విభూతి ఇది. కొంచెం నుదుటన గుండ్రంగా వచ్చేటట్టు దిద్దుకో" అని ಅನ್ನಾಡು.
అనంతరం సోమదత్తునితో "విభూతి బొట్టు స్పష్టంగా వచ్చిందా?" అని అడిగాడు ముని. "నా నుదురుపై బొట్టు నాకెలా కనిపిస్తుంది? అద్దంలో చూస్తేగాని తెలియదు" అంటూ సోమదత్తుడు అద్దంలో చూసుకుంటూ విభూతి బొట్టును గుండ్రంగా వచ్చేటట్లు సరిదిద్దుకున్నాడు. అపుడు ముని చిరుమందహాసం చేస్తూ 'చూడు నాయనా! మనకు కనిపించని నుదుట విబూతి మాదిరిగానే మనలోని దురలవాట్లు, తప్పులు మనకు తెలియవు. మన మంచికోరే ఆప్తులకే తెలుస్తాయి. అంటే వారు మన నడవడికను సరిదిద్దుకోడానికి అద్దంలాంటివారు. కనుక మన క్షేమం కోరి చెప్పేవారి మాటలను విని జీవితాన్ని సరిదిద్దు కోవాలి' అని బోధించాడు.

ముని మాటల్లోని అంతర్యాన్ని గ్రహించిన సోమదత్తుడు అనాటినుంచి తన ప్రవర్తనను మార్చుకుని అతి తక్కువ కాలంలోనే యోగ్యుడనిపించుకున్నాడు.