ఏకాగ్రత


భద్రాచలానికి దగ్గరలో గోదావరి నదీతీరానగల ఓ గ్రామంలో ఒక రామయ్య శాస్త్రి ఉండేవాడు. ఆయన సకల శాస్త్రాలు చదివిన ఉద్ధండపిండమే గాని లౌకిక జ్ఞానం లేనివాడు ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు అంటూ కాలం గడిపేవాడే కాని ప్రజల మధ్య మసలుకున్నవాడు కాదు. పిత్రార్జితమైన ఆస్తిపాస్తులు, పాడిపంటలకు లోటుండేది కాదు .
ఆ రామయ్య శాస్త్రి యజ్ఞం ఒకటి తలపెట్టాడు. అందుకు ఒక మేక కావలసి వచ్చింది... దానిని తెచ్చిపెట్టేవారెవరూ దొరకకపోవడం వల్ల కొని తెచ్చుకునేందుకు బయలుదేరాడు. ప్రక్క గ్రామంలోని గొల్లవీధిలోనికి వెళ్ళి ఓ చక్కని నల్లటి మేక నేరుకొని, దానికి వారడిగిన ధరయిచ్చి కొన్నాడు. పై మీద అంగవస్త్రంతో దాన్ని కట్టి పట్టుకొని తోలుకుంటూ తన స్వగ్రామమునకు బయలుదేరాడు.
మేకను తోలుకుంటూ వస్తున్న ఆ బ్రాహ్మడ్ని నలుగురు దొంగలు చూచారు. ఆ మేకమీద వాళ్లకు అశకలిగింది. ఆ బ్రాహ్మణుడి నుండి దాన్ని అపహరించి దాన్ని చక్కగా వండుకుని తినాలనుకున్నారు. అందుకా బ్రాహ్మణ్ణి బెదిరించడం, నిర్బంధించడం, దోచుకోవడం దేనికిపై మాటలతోనే మేకను కాజెయ్యాలని పన్నాగం పన్నారు.
ఆ రామయ్య శాస్త్రి కంటే ముందుకుపోయి మార్గమధ్యంలో నలుగురు నాలుగుచోట్ల కాసుక్కూచ్చున్నారు. మేకను తోలుకుంటూ వెడుతూ బ్రాహ్మణుడు దగ్గరకు రావడంతో మొదటి -దొంగ ఎంతో వినయంగా దండం పెట్టి "ఏంటి పంతులుగారూ! వల్ల కుక్కను పట్టుకుపోతున్నారు" అని తన త్రోవన తాను వెళ్లిపోయాడు. రెండవ దొంగను సమీపించేసరికి అతడు రామయ్య శాస్త్రితో కలసి అడుగులు వేస్తూ "అవునుగానీ అయ్యగారు ఈ కుక్క నెక్కడ్నించి తీసుకెడుతున్నారండి " అని తన దారిని తాను వెళ్ళిపోయాడు రామయ్య. వీడు కూడా దీన్ని కుక్కే అన్నాడేమిటా అని నడుస్తూనే దాన్నొకసారి ఎగాదిగా చూచాడు.
మరికొంతదూరం నడిచేసరికి మూడవ దొంగ ఎదురుపడి "ఏమండోయ్! బ్రాహ్మడు గారూ. కుక్కను పట్టుకు పోతున్నా రు. దానితోటి తమకేటి పనండి అయినా బ్రాహ్మణులు కుక్కను ముట్టుకోవచ్చునటండి" అని అతడూ వెళ్ళిపోయాడు.
"అరే! వీడు కూడా దీన్ని కుక్కనే అంటున్నాడు. ఇది కుక్క కాకపోతే వీళ్లంతా అలాగే ఎందుకంటారు మరి గొల్లవాడు నమ్మకంగానే ఇచ్చాడు. నేనేమన్నా మోసపోయానా?" అనుకుంటూ నడుస్తున్నాడు. అంతలో, నాల్గో దొంగ కలుసుకుని "ఇదేంటండి కర్రె కుక్కను పట్టుకెళ్తున్నాడు. తమ రెందుకండిది మీ ఊరోళ్లు చూస్తే కుక్కను ముట్టుకున్నారని తప్పు పట్టరా యేటి?" అని ముందుకు వెళ్లిపోయాడు.
"వీడు కూడా దాన్ని కుక్కనే అంటున్నాడు కుక్క కాకపోతే ఇంతమంది అదేమాట అంటారా దీన్ని ముట్టుకుని నేను మైలపడ్డాను. గొల్లడు నన్నెంత మోసం చేసాడు. తెలిసిన వాళ్ళ నెవరయినా పంపించి మేకనే కొనిపించుకోవాలి. ఈ కుక్క నాకెందుకు? దీనితో ఊచ్చికెడితే నలుగురూ గేలిచేసి తప్పపడతాడు" అని తర్కించుకుని అంగవస్త్రం విప్పి ఆ మేకను వదిలివేశాడు. గోదావరిలో స్నానంచేసి ఇంటికి చేరుకున్నాడు
అలా వదిలేసిన మేకను, వెనకనే వస్తున్న దొంగలు నలుగురు కలసి పట్టుకొని బ్రాహ్మడి తెలివితక్కువతానికి నవ్వుకుంటూ తీసుకొని వెళ్ళిపోయారు. నలుగురాడించే వేదమనుకునే విజ్ఞానునికిల్లాంటి భంగపాటే జరుగుతుందంటారు. ఒకే మాటమీద కలిసికట్టుగా నిలబడితే ఎలాంటివారినైనా ఒప్పించవచ్చు. ఎలాంటి పనినయినా సాధించవచ్చు.