గొప్పలకు పోరాదు



దేవలోకంలో ఒకనాడు బ్రహ్మ దేవేంద్రాది సమస్త దేవతలతో కొలువుదీరి వేదాంత విషయాలను ప్రసంగిస్తున్నాడు. యక్షగంధర్వ కిన్నెర కింపురుష, మురాసుర మానవ మహా జ్ఞానులంతా ఆ సభలో వున్నారు ఋషులు, సురులు, అసురులు అంతా తమకు తగిన స్థానాల్లో కూర్చుని వున్నారు.

అటువంటి నిండు సభలోకి ఒక వ్యక్తి వచ్చేడు. కమండలం, కృష్ణాజినం, పావుకోళ్లు, బిళ్ల సంచికట్టు, అత్యంత శోత్రీయం బ్రహ్మజ్ఞానమున మూర్తీభవించిన మహా మేధావిలా ఉన్నాడు. కమండలోదకాన్ని చల్లుకుంటూ మార్గాన్ని శుద్ధిచేస్తూ, అడుగుల్ని ఎత్తి ఎత్తి వేస్తూ మూర్తీభవించిన శోత్రీయుడిలా, ప్రకాశిస్తున్న విజ్ఞాన తేజోరాసిలా నడిచి వస్తున్న అతడ్ని చూచాడు. బ్రహ్మ 'అహో! ఎంత గొప్పవాడు అనుకుంటూ" ఆదరంగా ఆహ్వానించాడు. అతడి అంతస్తుకు తగిన ఆసనమేదో నిర్ణయించలేకపోయాడు.

అంతటివాడు మరెక్కడ కూర్చోమన్నా గౌరవంగా వుండదని తన అంకతలంలోనే కూర్చుండబెట్టుకున్నాడు. అతనిపట్ల బ్రహ్మ చూపించిన ఆదరణకు సభలోని యావన్మంది. అశ్రర్యపడ్డారు. సభలో వేదచర్చ జరుగుతుంది. బ్రహ్ము అంకతలంలో కూర్చున్న అతడు కూడా. యేదో మాట్లాడబోయాడు. అప్పుడు అతని నోటినుండి తుంపరులు తూలి బ్రహ్మముఖం మీద పడ్డాయి. దానితో బ్రహ్మకు కోసం వచ్చింది. "ఏమిటిది? వీడింత అపవిత్రంగా ప్రవర్తిస్తున్నాడు" అని మనోనేత్రంతో అతడిని పరిశీలించాడు. అతనికేమీ రాదని అంతా అనుకరించడం మినహా యే విధమైన సంస్కారం లేనివాడని గుర్తించాడు.

దానితో వాడ్ని తన అంకతలం నుండి క్రిందకు పడదోసి, "నీదంతా దంబమేనటరా, అది 'చూచి భ్రమపడి నీవు మహానుభావుడవనుకొని ఎవరికి దక్కని ఉన్నతస్థానంలో నిన్ను కూర్చుండ బెట్టేను. నీ దందాచారము చూచి భ్రమపడి విజ్ఞానులగు ఈ గొప్పవారి కందరికి అవమానము కలిగించినవాడనయ్యాను" అని విసుక్కున్నాడు.

పేదలకు పెద్దరికమును అనుకరించి ఆడంబరము చేయు దంబాచారులవలన తెలివైనవారే మోసపోతూ ఉంటారు. కాని అది స్థిరము కాదు. నిజము తెలియక మానదు. తెలిసిన తదుపరి అట్టి దంబులకు అధఃపతనం తప్పదు కనుక లేనిపోని వట్టి గొప్పలు చూపుట మంచిదికాదు.