మదనరేఖ మహారాజును దర్శించుట



ఆయన మాటలకు చిత్రరేఖ సమ్మతింపలేదు. "నీవు నన్ను పరిణయ మాడనిచో మరణిస్తాను కాని, జీవించలేను" అని ఖచ్చితముగా విన్నవించింది. "కూతురు ఎక్కడ మరణిస్తుందో" అన్న భయంతో తల్లి యగు మదనరేఖ ఆ వేళవు మహారాజునకు విన్న వించుకొని "నా కూతురుకు ప్రాణదానం చేయించు" మని వేడుకొన్నది.

వెంటనే మహారాజు-విద్యాసాగరుని తన వద్దకు పిలిపించాడు. అతని చూపులోని విలాసములకు చాలా మురిసిపోయాడు. "విద్యాసాగరా: నీకు తెలియని ధర్మములు ఉండవనియే తలంచుచున్నాను. నీకు రాత్రింబవళ్ళు సేవచేసి నిన్ను రక్షించునది; నీకు మనసిచ్చినది, నీవు కాదన్నచో మరణించగలదు. కావున ఆమెను భార్యగా స్వీకరించుము" అని బోధించాడు.

విద్యాసాగరుడు మహారాజును చూచి "మహారాజా: ఇది నా బ్రాహ్మణత్వమునకు భంగకరమైనది. ఆమెను మీరన్నట్లు స్వీకరించుటకు బ్రాహ్మణ కన్యక కాదుగదా!" అని తిరిగి మహారాజునే ప్రశ్నించాడు.

మహారాజు బాగా ఆలోచించాడు. "విద్యాసాగరా: మంచిది. నీవన్నట్లు బ్రాహ్మణ పుత్రికనే పెండ్లాడుము. తరువాతనే యీ కన్యకను స్వీకరింపుము." అని చెప్పాడు.

మహారాజు తన పురోహితునకు చెప్పి, ఆయన పుత్రికను, తన పుత్రికను వివాహం చేయించాడు తరువాత, ఆ సమయంలో కోశధికారియగు వైశ్యుడు సోమగుప్తుడు తన పుత్రికనుగూడ విద్యాసాగరునికి భార్యగా చేశాడు; తరువాత చిత్రరేఖను గూడ విద్యాసాగరుడు భార్యగా స్వీకరించాడు.