మల్లయోధుని వలలుడు ఓడించుట



ఒక రోజు విరాటుని కొలువులోకి ఒక మల్లుడు ప్రవేశించాడు. అతని భయంకరాకారం చూసి విరాటుని కొలువులోని వారంతా భయపడ్డారు. మల్లుడు " రాజా ! నేను అనేక రాజ్యాలు సందర్శించాను. ఎక్కడా నన్ను మల్లయుద్ధంలో గెలిచే వీరుడు కనిపించ లేదు. అందుకే మీ వద్దకు వచ్చాను " అన్నాడు. కొలువులో ఉన్న మల్లులు కూడా అతని భయంకరమైన ఆకారాన్ని చూడగానే వెనుకడుగు వేసారు. విరాటుని మొహం చిన్నబోయింది. ధర్మరాజు విరాటుని చూసి " విరాటరాజా ! ఇదివరకు నేను ధర్మరాజు కొలువులో ఉండగా ఒక మల్లుని చూసాను. అతడు ఇప్పుడు మీ కొలువులో వంటవాడిగా ఉన్నాడు. అతడు ఎందరో మల్ల యోధులను ఓడించాడు " అని చెప్పి ఊరకున్నాడు. విరాటరాజు వెంటనే వలలుని పిలిపించాడు. వలలుడు రాగానే విరాటరాజు " నీవు ఇతనితో మల్ల యుద్ధానికి సిద్ధం కమ్ము" అన్నాడు. అప్పుడు భీముడు అన్నగారి వైపు చూసాడు.

ధర్మరాజు అనుజ్ఞ ఇస్తూ కను సైగ చేసాడు. వలలుడు " మహారాజా! నేను ఇదివరకు ధర్మరాజ సభలో అనేక మంది మల్ల యోధులతో పోరాడి ఆయనకు వినోదం కలిగించాను. అలాగే మీకూ వినోదం కలిగిస్తాను " అన్నాడు. వలలుని వేషంలో ఉన్న భీముడు మల్లయోధునితో యుద్ధం మొదలు పెట్టాడు. భీముడు ఉత్సాహంతో తొడలు కొట్టాడు. ఇరువురు ఒకరిని ఒకరు చూసుకున్నారు. కిందికి వంగి మట్టిని వంటికి రాసుకున్నాడు. ఆఖరికి మల్లుని పట్టుకుని ముక్కు మీద గుద్ది బయటికి విసిరి వేసి భీముడు మల్లుని ఓడించాడు. విరాటరాజు వలలునికి ఎన్నో కానుకలిచ్చి సత్కరించాడు. భీముడు అక్కడున్న పేదవారికి ఆకానుకలు పంచి ఇచ్చి తిరిగి వంటశాలకు వెళ్ళాడు.ఆవిధంగా భీముడు మల్లులతో పోరుతూ అంతఃపుర కాంతలకు వినోదం కలిగిస్తున్నాడు.

మల్లులు లేనప్పుడు సింహములతో, పులులతో పోరి వినోదం కలిగించాడు. ద్రౌపది అందానికి ఆశ్చర్యపోతున్న కీచకుడు అజ్ఞాతవాసం ప్రశాంతంగా కొన్నిరోజులలో ముగుస్తున్న సమయంలో విరాటుని బావమరిది కీచకుడు అంతఃపురంలో అక్కను చూడటానికి వచ్చి యాదృచ్ఛికంగా ద్రౌపదిని చూసాడు. కీచకుడు మంచి అందగాడు, బలవంతుడు, కాని వివేక హీనుడు. అతడికి బలగర్వం, సౌందర్య గర్వం ఎక్కువ. అతడు విరాటరాజు కొలువులో దండనాయకుడు. కీచకుడు ద్రౌపది అందానికి ఆశ్చర్యపోయి ఆమె నుండి చూపులు మరల్చుకోలేక పోయాడు. అతడు మనసులో " అహా! మానవులు ఎవరైనా ఇంతటి అందగత్తెను చూసి ఉండరు.

ఇంతటి అందగత్తె మన్మధుని వద్ద ఉంటే ఆనాడు అతడు శివుని కూడా జయించే వాడు కదా. బ్రహ్మదేవుడు మన్మధుని అయిదు బాణాలు కలిపి ఈమెను సృష్టిండో ఏమో. మన్మధుడు కూడా విరహతాపంలో వేగిపోతాడేమో. ఈ సుందరాంగి తల్లితండ్రులు ఎవరో, అదృష్టవంతుడైన భర్త ఎవరో, పేరు ఏమో, ఈమెను పొందే మార్గమేమిటో, ఈ పనికి ఎవరు నాకు సాయపడగరు " అని పరిపరి విధాల ఆలోచించాడు. మాసిన చీర ధరించిన ద్రౌపది అతని వికారపు చూపులకు అసహ్యించుకుంది. ఆమె మనసులో " ఇతడు ఏమిటి ఇలా చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఇతని నుండి రక్షించే దిక్కెవరో " అనుకున్నది. కీచకుడు అదేమి పట్టించు కోకుండా ఆమె చూపులను చూసి శృంగార చేష్టలని అపోహ పడ్డాడు.

పక్కనే సుధేష్ణ, పరిచారికలు చూస్తున్నా పట్టించుకోకుండా ఆమె వైపు మోహంతో తధేకంగా చూసాడు. తరువాత తేరుకుని అక్క సుధేష్ణకు నమస్కరించాడు. ఆమె అతనికి ఉచితాసనం చూపించింది. కీచకుని మాటలు విన్న సుధేష్ణ " నేను అనుకున్నంత అయింది. ఈ సైరంధ్రిని చూసి కీచకుడు మోహావేశంలో పడ్డాడు. వీడికి ఏమి కీడు మూడుతుందో? వద్దన్నా వినే వాడు కాదు. నేనేమి చేసేది? నా శక్తి వంచన లేకుండా చెప్పి చూస్తాను " అనుకున్నది. సుధేష్ణ " తమ్ముడా కీచకా! నీ అంతఃపురంలో అతి సుందరులైన కాంతలు ఉన్నారు.

ఈ నీరసాకార అయిన సైరంధ్రి ఎందుకు " అని అనునయంగా చెప్పింది సుధేష్ణ. కీచకుడు " అక్కా! ఈ సైరంధ్రిని పోలిన అందగత్తె ఈ భూమి మీదే కాదు దేవతలలో కూడా లేదు ఇది నిజం. ఆమె నేత్రాలు, పద్మాలవంటి కళ్ళు, ఆ కోకిల కంఠం, ఆ మేని సొంపు నన్ను ఆకర్షిస్తున్నాయి. ఏ ఉపాయం అయిన సరే ఆమె నాకు కావాలి " అన్నాడు. కీచకుడు మామూలు మాటలతో వినడని సుధేష్ణ కొంచం కటువుగా చెప్ప సాగింది. " తమ్ముడా కీచకా! పరస్త్రీ సాంగత్యం వలన నీ ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి హరింపబడతాయని తెలియదా? ధర్మాత్ములు దీనిని హర్షించరు. భర్తకు తెలిస్తే ప్రాణం మీదకు వస్తుందని, ఇతరులు చూస్తే పరువు పోతుందని, సాటి ఆడువారికి తెలిస్తే గౌరవం పోతుందని, బంధువులకు తెలిస్తే వంశనాశనం ఔతుందని క్షణ క్షణం భయపడుతూ, భయపడుతూ, వ్యధతో ఉండే పరస్త్రీతో ఏమి సుఖపడతావు.

జారిణితో పొందు సుఖం కాదని అందరూ దూరంగా ఉంటారు. ఆమె భర్తలు గంధర్వులు వాళ్ళ చేతిలో నీవు మరణించవచ్చు. దానిని మర్చిపోరా తమ్ముడూ. చెడు మార్గలో చరించే వారికి వినాశనం తప్పదు నీ లాంటి బుద్ధి మంతులకు ఇది తగదు " అన్నది సుధేష్ణ. అక్క చెప్పిన మాటలు కీచకుని చెవికెక్క లేదు. " ఓ సుధేష్ణా! ఒక్క మాట చెప్తున్నాను విను. ఈ భూలోకంలో నన్ను ఎదిరించి నిలువగల వీరుడు లేడు. నా బాహుబలంతో గంధర్వాదులను సంహరించగలను. కనుక నాకు బుద్ధి చెప్పుట మాని నా కోరిక మార్గం సుగమం చెయ్యి " అని వంగి అక్క పాదాలకు నమస్కరించాడు. సుధేష్ణ " ఇక వీడు ఏమి చెప్పినా వినడు. వీడికి ఆమెను జతచేస్తే సరి. ఆమె భర్తలైన గంధర్వుల చేతిలో చస్తాడు.

లేకున్న మన్మధుడి చేతిలో చస్తాడు. ఎలాగైనా వీడికిక చావు తధ్యం " అనుకున్నది సుధేష్ణ. కీచకుని సభకు పాలు తేనెలను మోసుకు వెళుతున్న సైరంధ్రి సుధేష్ణ కీచకుని మంకుపట్టు గ్రహించి " తమ్ముడా కీచకా! ఎందుకు ఆరాట పడతావు. ఆమెను నీ వద్దకు పంపుట కష్టం కాదులే నీవు వెళ్ళు సైరంధ్రిని నీ వద్దకు పంపుతాను ఆ తరువాత నీ ఇష్టం " అన్నది. అక్క మాటలు విన్న కీచకుడు సంతోషంతో తన మందిరానికి వెళ్ళాడు. విందు భోజనం సిద్ధం చేసాడు, మధుర రసాలు ఏర్పాటు చేసాడు, పని వారందరిని పంపివేసాడు చేసాడు. తన మందిరంలో ఎవరూ లేకుండా చూసుకుని అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు.

సుధేష్ణ సైరంధ్రిని పిలిచి " మాలినీ! నాకు చాలా దాహంగా ఉంది. నా తమ్ముని కీచకుని ఇంట్లో రుచికరమైన మధ్యం ఉంది తీసుకురా " అన్నది ఈ మాటలు విన్న ద్రౌపది మనసు తల్లడిల్లింది. ఆమెకు శరీరం నిండా చెమట పట్టింది. ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలా అని భగవంతుని ప్రార్థించింది. ద్రౌపది " అమ్మా! నన్ను వదిలి పెట్టు. మధిరను తీసుకురావటానికి వేరొకరిని పంపు. నేను మీకు నీచపు పనులు చేయనని చెప్పాను. మీ గృహం అతి నిర్మలమయినదని నా భర్తలు దూరంగా ఉన్నా మిమ్ము నమ్మి మీ ఇంట ఉన్నాను.

మిమ్ము నమ్మిన నా వంటి అనాధను ఇలాంటి నీచపు పనులకు పంపడం భావ్యమా " అన్నది. సుధేష్ణ " మాలినీ! నేను మనసు పడి త్రాగాలని మధ్యం తేవడానికి నిన్ను పంపుతున్నాను. ఇందుకు నీచజాతి వారిని పంపగలనా. మన స్నేహం ఇంతేనా అని తెలియకుంది " అని నిష్టూరంగా మాట్లాడింది. దేవుని మీద భారం వేసి ద్రౌపది కీచకుని ఇంటికి బయలుదేరింది. దారిలో ఆమె సూర్యునికి నమస్కరించి " ఓ సూర్య భగవానుడా! నేను పాండు పుత్రులను తప్ప అన్యులను మనసునైనా తలపనేని నాకు ఈ కీచకుని వలన ఎటువంటి ఆపద కలగ కుండా కాపాడు " అని ప్రార్థించింది.

సూర్యుడు కరుణించి ద్రౌపదికి రక్షణగా ఒక రాక్షసుని పంపాడు. అతడు అదృశ్య రూపంలో ద్రౌపదిని వెన్నంటి వస్తున్నాడు. ద్రౌపది తడబడే అడుగులతో కీచకుని ఇంట ప్రవేశించింది. కీచకుడు ఆమె రాకకోసమే ఎదురు చూస్తున్నాడు. ద్రౌపది కీచకునితో " మాదేవి తృష్ణ తీరటానికి మధిర తీసుకు రమ్మంది. త్వరగా మధిరను ఇవ్వండి " అన్నది. కీచకుడు " మీ దేవి తృష్ణ తీర్చినట్లే నా తృష్ణ తీర్చవా " అన్నాడు. ద్రౌపది " ఆలస్యం అయితే మా దేవి కోపిస్తుంది. త్వరగా మధిరను ఇవ్వండి " అన్నది. కీచకుడు " మధ్యం వేరే వాళ్ళతో పంపుతాను. నీవు ఈ మధ్యంత్రాగి నా తాపాన్ని పోగొట్టు. నిన్ను నా రాణిని చేసుకుంటాను.

అపారమైన మణిభూషణాలు, విలాస గృహాలు నీకు సమర్పిస్తాను. నా భార్యలను నీకు దాసిని చేస్తాను. నేను నీ కనుసన్నలలో మెలుగుతాను " అంటూ కీచకుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు. అంతలో ద్రౌపదికి రక్షగా ఉన్న రాక్షసుడు ఆమెలో ప్రవేశించాడు. అంత బలాడ్యుడైన కీచకుని ఆమె విదిలించి కొట్టి బయటకు వచ్చింది. కీచకుడు ఆ మెను వెంబడించాడు. ద్రౌపది పరుగెత్తి విరాటుని కొలువులో ప్రవేశించింది. కీచకుడు ఆమె వెంట కొలువులో ప్రవేశించి ఆమె జుట్టు పట్టుకుని లాగి కింద పడేసాడు. ఆ సమయంలో ఆమెలో ఉన్న రాక్షసుడు కీచకున్ని కొట్టి లాగి కింద పడవేసాడు.

కీచకుడు ఆ బదెబ్బకు అవమానంతో కుంగి పోయాడు. ఆసమయంలో అన్నగారితో పాటు కొలువు కూటంలో ఉన్న భీముడు ఆగ్రహంతో ఊగి పోయాడు. ఒక్క క్షణం తమ అజ్ఞాత వాస విషయం మరిచాడు. కీచకుని పైన పట్టరాని కోపంతో వెంటనే పక్కన ఉన్న వృక్షాన్ని చూసి అలాగే అన్నగారి వైపు చూసాడు. ధర్మజుడు భీముని కను సైగతో వారించాడు. ధర్మరాజు విరాటునితో " మహారాజా! మన వంటల వాడు వలలుడు ఎక్కడ చూసాడో కాని వంట చెరకు కొరకు వేరు వృక్షాలు లేవా? ఫలపుష్పాదులతో ఉండి నలుగురికి నీడ నిచ్చే వృక్షాన్ని వంట చెరకు కొరకు ఖండించడం తగునా " అన్నాడు. భీముని కోపం ధర్మరాజు వారింపు ద్రౌపది చూసి విరాటునితో " అయ్యా! ధర్మాధర్మాలు తెలిసిన వారు, శత్రువులను అవలీలగా చంపగలిహిన వారు, గంధర్వులు అయిన నా భర్తలు అయిదుగురు నన్ను ఈ కీచకుడు అవమానిస్తుంటే చూస్తూ ఊరకున్నారు. ఇక సామాన్యమైన స్త్రీలకు రక్షణ ఏది. ఈ విరాటరాజు కొలువులో స్త్రీకి అవమానం జరుగుతుంటే ఎవరూ పలకరేమి? ఎవరికీ కరుణ లేదా? ధర్మరక్షణ చేయవలసిన రాజు ఇలా మిన్నకుండటం భావ్యమా? " అని సూటిగా ప్రశ్నించింది. అది చూసిన విరాటరాజు కీచకుని మందలించడానికి ధైర్యం లేక ద్రౌపదిని అనునయించాడు. అది చూసి కీచకుడు తన మందిరానికి వెళ్ళాడు. కలత చెందిన మనసుతో ధర్మరాజు ద్రౌపదిని చూసి " సైరంధ్రీ! నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు అంతఃపురానికి వెళ్ళు. నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు మాత్రం కోపించరా? ఇది సమయం కాదని ఊరకుండి ఉంటారు. నీ భర్తలను నిందించడం తగదు. కులస్త్రీ నిండు సభలో ఇలా మాట్లాడటం భావ్యమా " అన్నాడు. కాని ద్రౌపది అక్కడి నుండి కదలక ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తుంటే ధర్మరాజు " ఓ సైరంధ్రీ! ఏమిటిది పదిమందిలో నాట్యకత్తెలా నిలబడ్డావు. కులస్త్రీలకు ఇది తగదు " అన్నాడు.

ద్రౌపది రోషంగా తల ఎత్తి ధర్మరాజును చూసి " ఓ కంకు భట్టా! నా భర్త ఒక నటుడు ఇది సత్యము. పెద్దల ప్రవర్తన చూసి పిన్నలు ప్రవర్తిస్తారు. నా భర్త నటుడు కనుక నేను నర్తకినే. నా భర్త నటుడే కాదు జూదరి కూడా. ఒక జూదరి భార్యకు గౌరవ మర్యాదలు ఎలా లభిస్తాయి ? " అంటూ ద్రౌపది సభ నుండి వెళ్ళి పోయింది.

ద్రౌపది తనను ఒక దూర్తుని ఇంటికి మదిరకు పంపిన సుధేష్ణకు తన బాధ చెప్పుకోటానికి ఆమె మందిరానికి వెళ్ళింది. సుధేష్ణ ద్రౌపదిని చూసి కంగారు నటిస్తూ " మాలినీ ! ఏందుకు ఇలా ఉన్నావు. నిన్ను ఎవరేమి అన్నారు. ఏమి జరిగిందో చెప్పు వారి అంతు చూస్తాను " అన్నది. ద్రౌపది నిర్వేదంగా నవ్వి " అమ్మా ! అన్నియు తెలిసి కూడా ఇలా అడిగితే ఏమి చెప్ప గలను. నీవు కీచకుని ఇంటికి మధిర కోసం నన్ను పంపావు. అతను నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను పరుగెత్తాను. అతడు నన్ను వెంబడించి నా జుట్టు పట్టుకుని కొట్టాడు. ఇంతకంటే ఏమి చెప్పేది " అన్నది.

సుధేష్ణ ద్రౌపదితో " ద్రౌపదీ! విచారించకు నేను ఆ కీచకుని దండిస్తాను " అని అనునయంగా అన్నది. ద్రౌపది సుధేష్ణతో " అమ్మా! తమరు అంతగా చింతించ పనిలేదు. నా భర్తలైన అయిదుగురు గంధర్వులు కీచకునిపై పగతీర్చుకుంటారు " అని పలికింది. ఆ మాటలు విన్న సుధేష్ణ భయభ్రాంతురాలయ్యింది. ద్రౌపదిని ఎన్ని విధాలుగానో ఓదార్చింది. ద్రౌపది కోపం తగ్గలేదు. అన్న పానీయాలు విసర్జించి తన నివాసమునకు పోయి రోదిస్తూ ఉంది. ద్రౌపది మనసులో " కీచకుడు మహాబలవంతుడు. అతనిని చంపగలిగిన సామర్థ్యం భీమునికి మాత్రమే ఉంది " అని తలచింది. ఆ రోజు అందరూ నిద్రపోతున్న సమయంలో భీముని వద్దకు వెళ్ళింది.

హాయిగా నిద్రపోతున్న భీముని చూసి " ఆహా ! నన్ను అవమానించిన కీచకుడు హాయిగా నిద్రపోతున్నాడు. కాని అది చూసిన మీరు నిశ్చింతగా ఎలా నిద్రపోతున్నారు. అన్నగారు ఇది తగిన సమయం కాదని చెప్పాడనా " అనుకుంటూ అతడిని తట్టి లేపింది. భీముడు ఉలిక్కిపడుతూ నిద్రలేచి " ఎవరు? " అని అడిగాడు. ద్రౌపది " నేను మాలినిని " అన్నది. భీముడికు ద్రౌపది ఎందుకు వచ్చిందో అర్ధమైనా ఆమె నోట వినాలని " ఏమిటి ఇంత పొద్దుపోయి వచ్చావు?. ఎవరు చూడకుండా వచ్చావా? " అని అడిగాడు. ద్రౌపది " అన్ని తెలిసి నన్ను అడుగుతారేమి. నా నోట వినాలనుందా! విరాటుని బావమరిది కీచకుడు సుధేష్ణ ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసాడు.

అతడు నన్ను మోహించి అనరాని మాటలాడి నన్ను అవమానించాడు. నేను అతనితో నా భర్తలైన గంధర్వులు నిన్ను హతమార్చగలరు జాగ్రత్త " అన్నాను. సుధేష్ణ పంపగా మధిర కోసం కీచకుని ఇంటికి వెళ్ళాను. అతను నన్ను పట్టుకోవాలనుకున్నాడు నేను అతనిని విదిలించి పరుగెత్తుతూ సభా మండపానికి వచ్చాను. అతడు నన్ను వెన్నంటి తరుముతూ వచ్చాడు. అలనాడు కురుసభలో దుశ్శాసనుడు నన్ను అవమానించాడు. అడవిలో సైంధవుడు అవమానించాడు. ఈ నాడు విరాటుని కొలువులో కీచకునిచే అవమానించబడ్డాను. ఈ అవమానాలు నాకు కొత్తగాదు. స్త్రీ ఆర్తనాదం విన్నా, గోమాత అరుపు విన్నా రక్షించడం వీరుల ధర్మం.

నేను ఇలా విలపిస్తుంటే ధర్మరాజు చూస్తూ ఎలా ఉన్నాడు? " అన్నది. భీముడు " ద్రౌపదీ! కీచకుడు నిన్ను అవమానించడం చూసిన నన్ను ధర్మరాజు అడ్డుకోకపోతే విరాటునితో సహా కీచకుని అతని సైన్యాన్ని హతమార్చే వాడినే. కాని అజ్ఞాతవాసం భగం అయితే మరలా అరణ్యవాసం అజ్ఞాతవాసం ప్రాప్తించేవి. దీనికంతా కారణం నీవు నేను అని అందరూ మనలను నిందించరా. కనుక నన్ను నివారించిన ధర్మరాజును నిందించ వలదు. సమయం మించి పోలేదు. కీచకుని చంపి నీకు ఆనందం కలిగిస్తాను అదెంత పని. కాని అది బహిరంగంగా జరగరాదు. రహస్యంగా చేయాలి కదా " అన్నాడు. ద్రౌపది " నేను ఎవరికి భయపడ లేదు. అత్తగారు కుంతిని చూసి కాని భర్తలైన మిమ్మల్ని చూసి కాని భయపడ లేదు. కాని సుధేష్ణను చూసి భయం కలుగుతుంది.

మూర్కుడైన కీచకుని వలన జరిగిన అవమాన భారంతో అన్నాను కాని విషయం తెలియక కాదు. ధర్మరాజుని నిందించడం నా అభిమతం కాదు " అన్నది. ఇంకా ధర్మరాజును గురించి ద్రౌపది ఇలా చెప్పింది. " భీమసేనా! రాజసూయ యాగ కర్త, అజాతశత్రువు, ధర్మనిరతుడనే పేరు ధర్మరాజుకే చెల్లింది కాని వెరెవరికి తగదు. అతని గంభీర్యం, కరుణ, నిత్య సత్యవ్రతం మరెవరికి ఉంటాయి. అతడు సామాన్య మానవుడు కాదు. అట్టి మహాత్ముడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే బాధగా ఉంది. బకాసురుడు, కిమ్మీరుడు (జరాసంధుడు) మొదలైన రాక్షసులను చంపిన నీ లాంటి వీరుడు కట్టెలు కొట్టడం, వంటలు చేయడం ఎంత బాధాకరం.

పరమేశ్వరుని మెప్పించి పాశుపతాన్ని సంపాదించిన అర్జునుడు పేడి రూపంలో అంత॰పుర కాంతలకు నాట్యం నేర్పుతుంటే చూడటానికి కూడా మనసు ఒప్ప లేదు. అత్యంత సుందరాంగుడు అరివీర భయంకరుడు అయిన నకులుడు ఒకరి కింద ఊడిగం చేస్తుంటే కన్నుల నీరు ఆగడం లేదు. అత్యంత సుకుమారుడైన సహదేవుడు పశువులను మేపుతుంటే దుఃఖభారం ఆగలేదు. తల్లి తండ్రుల ప్రేమాభిమానాలు పొంది, రాజసూయ యాగంతో పునీతనై కుంతీదేవి లాంటి మహానుభావురాలి మన్ననలందిన నేను నేడు సైరంధ్రిగా సామాన్యురాలిగా సేవిస్తున్నాను. భీమసేనా! కీచకుని వధించక పోతే నాకు మనశ్శాంతి లేదు " అని దుఃఖించింది. భీముడు " ద్రౌపదీ! నీవు ఇంతగా చెప్ప పని లేదు. రేపటి రోజున కీచకునికి నా చేతిలో చావు మూడింది. నీవు నిశ్చింతగా ఉండు. మన అజ్ఞాతవాసం ముగియనున్నది. రేపు నువ్వు కీచకుని కోర్కె అంగీకరించినట్లు నటించి అతనిని నర్తనశాలకు ఒంటరిగా రమ్మని చెప్పు. నేను అతనిని చంపుతాను. తెల్లవారబోతుంది ఇక వెళ్ళు " అన్నాడు.

మరునాడు ఉదయం కీచకుడు నిద్రలేచాడు. కాలకృత్యాలు నిర్వర్తించాడు. ద్రౌపది మీది కోరిక కలిగింది. చక్కగా అలఖరించుకున్నాడు. ద్రౌపది కోసం సుధేష్ణ అంత॰పురానికి వెళ్ళాడు. సైరంధ్రిని చూడగానే అతని మనసు చలించింది. ధైర్యాన్ని, వివేకాన్ని కోల్పోయి ఆమె దగ్గరగా పోయాడు. భీముడు చెప్పిన మాటలు మననం చేసుకుంది ద్రౌపది. అతనిని చూసీ చూడనట్లు నటించింది. కీచకుడు ద్రౌపదితో " మాలినీ ఈ తిరస్కారం ఏమిటి? నేనంటే ఇష్టం లేదా? అసలు మగాళ్ళంటేనే ఇష్టం లేదా? నా సంపదలకు నీవే రాణివి. ఈ రాజ్యాన్నేలే విరాటరాజు పేరుకు మాత్రమే రాజు. నేనే అతనికి కూడు పెడుతున్నాను. ఈ రాజ్యంలో ప్రజలందరూ నన్నే రాజుగా ఆరాధిస్తారు.

ఈ రాజ్యంలో ప్రజలెవరికీ నా మాట కాదనే ధైర్యం ఎవరికీ లేదు " అన్నాడు. ద్రౌపది కొంచం మెత్తబడినట్లు నటించి " కీచకా! ఎంత కాదన్నా వినకుండా నా మీద మనసు పారేసుకున్నావు. నీలాగే ఎదుటి వారూ మనసు పారేసుకుంటారు కదా. మీరు పురుషులు కనుక బయట పడతారు కాని మగువలు అలా కాదు కనుక కీచకా రహస్యంగా కలుసుకుంటే నీ కోరిక తీరగలదు " అంటూ నమ్మబలికింది ద్రౌపది. కీచకుడు ఆనందపరవశుడై " మాలినీ నీ మనసు తెలిసింది కదా మరి నా కోరిక ఎప్పుడు ఎలా తీరుస్తావో చెప్పు " అని అడిగాడు. ద్రౌపది " ఈ రోజు ఒంటరిగా నర్తనశాలకురా " అన్నది. కీచకుడు " మాలినీ! నీ అనుమతి ప్రకారం ఒంటరిగా నర్తనశాలకు వస్తాను. మాట మీద ఉండు " అన్నాడు.

ద్రౌపది " నీవు ఒక్కడివే రావాలి. లేకుంటే నేను వెడలి పోవుట నిశ్చయం. ఇక మనమిరువురము ఇక్కడ ఉండుట భావ్యం కాదు వెళ్ళి పొండి " అన్నది. కీచకుడు వెళ్ళగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళింది. అక్కడ భీమునితో " నేను నాపని పూర్తి చేసాను. ఇక మీ పని మీరు పూర్తి చెయ్యండి. ఈ రాత్రికి కీచకుని చంపాలి ఎలా చంపుతారో చెప్పండి " అన్నది. భీముడు ద్రౌపదితో " ద్రౌపదీ! నీవు కీచకుడు ఏమి మాట్లాడుకున్నారో చెప్పు" అని అడిగాడు. ద్రౌపది జరిగినది చెప్పగానే అది విన్న భీముడు ఆహ్లాదం పొందాడు.

భీముడు " ద్రౌపదీ ! ఇక చాలు ఆ కీచకుని మీద పగ తీర్చుకుంటాను కాని అతడు చెప్పినట్లు ఒంటరిగా వస్తాడా! లేక బుద్ధిహీనుడై అందరికి చెప్తాడా? అయినా ఎందుకు చెబుతాడులే. వాడు నర్తనశాలకు తప్పక వస్తాడు. నిశ్చలంగా పడుకున్న నన్ను తడిమి చూస్తాడు. నీవు కాదని తెలిసుకుంటాడు. నేను ఒడిసి పట్టుకుని వాడి అంతు చూస్తాను. వాడు నా చేతిలో హతం కావడం నిశ్చయం ద్రౌపదీ! ఇక నీవు నిశ్చింతగా ఉండు " అన్నాడు. భీముని ఆవేశం చూసి ద్రౌపది భయపడింది. కోపావేశంలో గుట్టు బయటపడి అజ్ఞాతవాస భంగం ఔతుందేమో అనుకున్నది. ద్రౌపది " భీమసేనా! కోపావేశంలో గుట్టు రట్టు చేయకు ధర్మరాజాదులు అజ్ఞాతవాస భంగానికి మనమే కారణమని నిందిస్తారు.

కార్యాన్ని అతి గుప్తంగా పూర్తి చేయాలి " అన్నది. భీమసేనుడు " ద్రౌపదీ !వాడు ఎదిరించి నిలబడితే ఇది రహస్యంగా చేయాలని గుర్తుంటుందా. అయినా నీవు చెప్పినట్లు రహస్యంగా చంపడానికి ప్రయత్నిస్తాను " అన్నాడు. ద్రౌపది " సుధేష్ణ నా కొరకు వెతుకుతుంటుంది నేను పోయి వస్తాను " అని వెళ్ళి పోయింది. కీచకుడు మనసు పరి పరి వధాల తపిస్తుంది అతడు మనసులో " అయ్యో ! ఎంతకీ రాత్రి కాదేమి. మాలిని వస్తుందో రాదో, వచ్చినా ఏమంటుందో, రాత్రిలోగా మనసు మారుతుందేమో, ఆమెకు అయిదుగురు గంధర్వులు భర్తలుగా ఉన్న మాట నిజమేనా, మాలిని వచ్చే వేళకు సుధేష్ణ ఏదైనా పని చెప్తుందేమో అనుకున్నాడు.

మరలా మాలిని ఎందుకు రాదులే అంత కఠినాత్మురాలా . ఆమె వచ్చే ముందు నేనే ఆమెను తీసుకు రావచ్చు కదా " అనుకున్నాడు. కీచకుడు ఉద్యానవనంలో విహరిస్తూ అస్తమించనందుకు సూర్యుని నిందించాడు. తన కోసం బ్రహ్మ రాత్రి రాకుండా పగలే ఉంచాడని అనుమాన పడ్డాడు. ఎట్టకేలకు సూర్యుడు అస్తమించాడు. చంద్రోదయం అయింది ద్రౌపది కూడా సమయం కోసం ఎదురుచూస్తూ ఉంది. చంద్రుడు కూడా అస్తమించాడు. బాగా పొద్దు పోగానే ద్రౌపది వంటశాలకు వెళ్ళి సమయం ఆసన్నమయినదని భీమసేనుని తొందర పెట్టింది. భీముడు ఒక చీరని తలపాగాలా చుట్టుకుని నర్తనశాలకు బయలుదేరాడు.

ద్రౌపది అతనిని అనుసరించింది. ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి " మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను " అన్నాడు కీచకుడు.

భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో " మిమ్మల్ని మీరు పొగుడు కుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే . నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే " అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు. ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు.

ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళాను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో " కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు " అనుకున్నది.

భీముడు " ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి నా బుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా " అన్నాడు. ద్రౌపది ఆనందంతో " నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా " అన్నది. ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ " ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను" అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు. ధర్మరాజు తమ్ములను చూసి " మనం అయిదుగురం ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి " అన్నాడు.

అర్జునుడు " అన్నయ్యా! మనకు యమ ధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా ! మనం ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కురు దేశం చుట్టూ పాంచాల, చేధి, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం " అన్నాడు. ధర్మరాజు " నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి, మంచివాడు, బలవంతుడు అతని పాలనలో మనం అజ్ఞాత వాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాట రాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి " అన్నాడు.

అర్జునుడు " అన్నయ్యా ! నీవు మహనీయ మూర్తివి. సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించ గలవు " అన్నాడు. అర్జునా " నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిషము మొదలగునవి తెలియును. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జ్యూద ప్రియుడనని నీకు తెలుసు కదా. విరాటరాజును జ్యూదముతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు భీమసేనుని చూసి " భీమసేనా ! బకాసుర, కిమ్మీరాదులను చంపిన నీవు సేవకా వృత్తి ఎలా చేస్తావు " అన్నాడు. భీమసేనుడు " అన్నయ్యా! నాకు రుచికరంగా వంటలు చేయడం వచ్చు కదా. వంటలవాడిగా విరాటరాజు కొలువులో చేరతాను.

పైగా నాకు మల్ల యుద్ధంలో ప్రావీణ్యం ఉంది కదా. అతని కొలువులో మల్ల విద్యా ప్రదర్శనలు ఇస్తూ అందరికి వినోదం కలిగిస్తాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ధర్మరాజు కొలువులో వంటవాడిగా ఉన్నానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు అర్జునుని చూసి " అర్జునా ! నీ సంగతి ఏమిటి నీవు ఎలాంటి కొలువు చేస్తావు " అని అడిగాడు. అర్జునుడు " అన్నయ్యా ! నేను దేవేంద్రుని దగ్గరకు వెళ్ళినప్పుడు నన్ను ఊర్వసి కామించగా నిరాకరించాను. అప్పుడు ఊర్వశి నపుంసకుడివి కమ్మని శపించింది.

దేవేంద్రుడు నన్ను ఆ శాపాన్ని అజ్ఞాత వాస కాలంలో అనుభవించమని చెప్పాడు. అజ్ఞాతవాసం కాగానే శాపవిమోచనం కాగలదని చెప్పాడు. ఆ శాపవశమున నేను విరాటరాజు కొలువులో పేడి రూపం దాల్చి విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. నాకు నాట్య విద్యలో ప్రవేశం ఉంది. నేను అంతఃపురకాంతలకు నాట్యం నేర్పుతాను. నా పూర్వ చరిత్ర అడిగితే నేను ద్రౌపది అంతఃపురంలో నాట్యాచారుడిగా ఉన్నానని చెప్తాను " అని అన్నాడు. తరువాత నకులుని చూసి " ఇతడు చాలా సుకుమారుడు, అందగాడు ఇతడు తన నిజ రూపమును ఎటుల దాచగలడు. ఒరులను ఎలా సేవించ గలడు " అన్నాడు. నకులుడు " అన్నయ్యా ! నాకు అశ్వ శిక్షణలో ప్రవేశమున్నది. నేను అశ్వ శిక్షకుడిగా విరాటుని కొలువులో చేరతాను.

అశ్వశాలలోని గుర్రాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకుంటాను. ధామగ్రంధి నామంతో సంచరిస్తాను. ఇంతకు పూర్వం నేను ధర్మరాజు కొలువులో అశ్వశిక్షకుడిగా పనిచేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు నవ్వి " సహదేవుని వైపు చూసాడు. సహదేవుడు " అన్నయ్యా ! నాకు పశు పోషణలో అనుభవం ఉంది. తంత్రీ పాలుడనే పేరుతో గోరక్షకుడిగా విరాటుని కొలువులో ప్రవేశిస్తాను. ఇంతకు పూర్వం ధర్మరాజు కొలువులో గోరక్షకుడిగా పని చేసానని చెప్తాను " అన్నాడు. ధర్మరాజు ద్రౌపదిని చూసి " సుకుమారీ ! ఇంత వరకు పనులు చేయించుకున్నది కాని ఎవరిని సేవించి ఎరుగదు. ఇంతటి ఉదాత్తచిత్త ఏ పని చేయగలదు " అని మనసులో బాధపడ్డాడు. అది గ్రహించిన ద్రౌపది " నేను సైరంధ్రీ వేషంలో మాలిని అనే పేరుతో విరాటరాజు అంతఃపురానికి వెళతాను.

విరాటరాజు భార్య సుధేష్ణను ప్రసన్నం చేసుకుంటాను. అందరూ గౌరవించే విధంగా సైరంధ్రీ వ్రతం సాగిస్తాను " అన్నది. అందరికి అన్ని పనులు కుదిరాయి. మనం అందరం అజ్ఞాత వాసాన్ని నిరపాయంగా గడుపుదాం. ధౌమ్యుల వారు అగ్ని హోత్రం రక్షిస్తుంటారు. మిగిలిన వారు వారి వారి స్వస్థలాలకు వెళతారు. ఎవరైనా మా గురించి అడిగితే ద్వైతవనం నుండి ఎటో వెళ్ళారని చెప్పండి " అని ధర్మరాజు ఆదేశించాడు. ధౌమ్యుడు పాండవులను చూసి " ధర్మరాజా ! మీరు కురువంశంలో జన్మించారు. గౌరవంగా బ్రతికారు. ఇలాంటి మీరు పరులను సేవించుట కష్టమే. కాని మనకు అనుకూలం కాదని మరచి పోవద్దు. మీరు పరాక్రమాలు ప్రదర్శిస్తే అజ్ఞాతవాసం భగ్నమౌతుంది.

రాజులను సేవించేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. రాజుతో చనువుగా ఉన్నాను అనుకుని రాజమర్యాద అతిక్రమిస్తే హాని కలుగుతుంది. రాజుకన్నా విలువైన దుస్తులు ధరించటం కాని, రాజుకన్నా అధికంగా మాట్లాడటం కాని, రాజగృహంకన్నా ఆడంబరమైన గృహంలో నివసించటం కాని చేయకూడదు. సహజంగా రాజులు తమ ఆజ్ఞను ఉల్లంఘించిన వారు పుత్రులైనా మిత్రులైనా శత్రువులుగా చూస్తారు. తాను చేయలేని పని తలపై వేసుకో కూడదు అందువలన భంగపాటు తప్పదు. రాజుల యందు మౌనంగా ఉండకూడదు అలాగని అతిగా భాషించ కూడదు. మితమైన చతుర సంభాషణచే రాజులను మెప్పించాలి. అంతఃపుర రహస్యాలను బయట పెట్టకూడదు. రాజుకు చెప్పదగినవి, వినదగినవి అయిన మాటలనే చెప్పాలి.

రాజు అనుమతి మీదనే ఆసనాన్ని అధిరోహించాలి. రాజుకన్నా ఉన్నతాసనం పై ఎప్పటికీ అధిరోహించకూడదు. రాజు అభిమానించాడని పొంగి పోకూడదు. అలాగే అవమానిస్తే కుంగి పోకూడదు. రాజు చెప్పిన పనిని ఎండ, వాన, ఆకలి, దప్పిక, కాలము ప్రదేశం నిమిత్తం లేకుండా చేయాలి. రాజధనాన్ని విషంతో సమానంగా చూడాలి. రాజధనాన్ని సంగ్రహించడం ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. రాజు కొలువులో నవ్వటం ఆవులించడం చేయకూడదు. రాజుగారి శత్రువులతోకాని, వారి దూతలతో కాని సన్నిహితంగా మెలగ కూడదు. భటుడు సంపద కలదు కదా అని అధికంగా భోగింపరాదు. రాజుకు కంటగింపుగా ఉంటుంది.

కనుక అజ్ఞాతవాస సమయమున మీరు అణగి మెణగి మెలగవలసి ఉంటుంది " అన్నాడు. ధర్మరాజు ధౌమ్యుని బుద్ధిమతి విని " మాకు అన్నీ మీరే. మాకు తెలియని అనేక విషయాలు చెప్పారు. వాటిని తప్పక పాటిస్తాము " అన్నారు. ధౌమ్యుని ఆశీర్వాదం పొంది పాండవులు ధౌమ్యుడు అక్కడి నుండి విరాటనగరానికి వెళ్ళారు. యమునా నది వెంట నడుస్తున్నారు. మత్స్యదేశ పొలిమేర చేరగానే అక్కడ ఒక ఆశ్రమంలో ధౌమ్యుడు ఆగి పాండవులు వెళ్ళాక అగ్నిహోత్రాలు తీసుకుని పాంచాల దేశానికి వెళ్ళాడు. పాండవులు అరణ్యాల వెంట తమ ప్రయాణం సాగించారు.విరాటనగరానికి వెళ్ళటానికి చాలా దూరం నడిచారు. ద్రౌపది ఇక నడవ లేక పోయింది విశ్రాంతి తీసుకుంటాము అనుకుంది. ధర్మరాజు అందుకు ఒప్పు కోలేదు త్వరగా విరాట నగరం చేరాలన్నది అతని కోరిక పట్టుదల.

ద్రౌపది ఇక ఒక అడుగు కూడా వేయలేనని చెప్పింది. ధర్మరాజు నకులుని చూసి " నకులా! ద్రౌపది అలసి పోయింది కొంచం ఎత్తుకుని తీసుకు రాగలవా " అని అడిగాడు. నకులుడు " నేను కూడా అలసి పోయాను అన్నయ్యా " అన్నాడు. ధర్మరాజు సహదేవుని అడిగాడు. సహదేవుడు అలాగే సమాధానం ఇచ్చాడు. ఇక అర్జునిని వంతు వచ్చింది. అర్జునుడు ద్రౌపదిని అవలీలగా ఎత్తుకుని విరాట నగరం వైపు నడిచాడు. అందరూ విరాట నగర పొలిమేర చేరగానే కొంత తడవు ఆగారు. ధర్మరాజు తమ్ములతో " మనం ఈ ఆకారాలతో ఆయుధాలతో నగరంలో అడుగు పెడితే మనలను సులువుగా గుర్తిస్తారు. మనం మన ఆయుధాలను దాచాలి " అన్నాడు. ధర్మరాజు మాటలు విని అందరూ చుట్టూ పరికించారు. పక్కనే శ్మశానం ఉంది. అక్కడకు సామాన్యంగా ఎవరూ రారు.

భూత, ప్రేత, పిశాచాలు అక్కడ తిరుగు తాయని ప్రజలు అక్కడకు రారు. అందువలన ఆయుదాలను దాచడానికి అదే అనువైనదని భావించారు. ఆ శ్మశానంలో ఒక జమ్మి చెట్టు ఉంది. ఆ జమ్మి చెట్టు ఆకాశాన్ని అంటే కొమ్మలతో దట్టమైన ఆకులతో పగటి పూట చూడటానికి కూడా భీతి కొల్పేలా భయంకరంగా ఉంది. ఆ జమ్మి చెట్టును చూసిన అర్జునుడు " అన్నయ్యా ! మనం మన ఆయుధాలను ఇక్కడ భద్రపరుస్తాము " అన్నాడు. పాండవులు తమ ఆయుధాలను ఒకచోట చేర్చి వాటిని వెండ్రుకలు ఉన్న చని పోయిన మృగ చర్మంతో కట్టారు. పక్కనే పడి ఉన్న ఒక జంతు చర్మాన్ని సహదేవుని సాయంతో తీసుకు వచ్చి దానితో ఆమూట కట్టారు. ఆ పక్కనే ఒక అనాధ శవం పడి ఉంది. ఆ శవాన్ని ఆయుధాల మూటతో చేర్చి కట్టారు. ధర్మరాజు ఆ జమ్మి చెట్టు ఎక్కి ఆయుధాల మూటను చెట్టుకు వ్రేలాడ కట్టాడు.

ధర్మరాజు ఆ ఆయుదాల మూటకు నమస్కరించి తనకు అర్జునికి తప్ప మిగిలిన ఎవరికైనా అవి సర్పాల వలె కనపడాలని ప్రార్ధించాడు. భీముడు వస్తే అస్సలు కనపడ వద్దని వేడుకున్నాడు. ధర్మరాజు చెట్టు దిగి చుట్టూ పరికించాడు. దూరంగా కొంతమంది పశువుల కాపర్లు కనిపించారు. వారి దగ్గరకు పోయి " అయ్యలారా! మా తల్లి చనిపోయింది. మా కులాచారం ప్రకారం శవాన్ని జమ్మి చెట్టుకు వ్రేలాడ కట్టాలి అందుకే కట్టాము " అని శవాకృతిలో ఉన్న ఆయుధాల మూట చూపించాడు. అమాయకులైన గొల్లలు భయభ్రాంతులై ఇతరులకు చెప్పటానికి పరుగు పరుగున వెళ్ళారు.

ధర్మరాజు దుర్గాదేవిని ప్రార్ధించాడు. ఆమె తమను ఎవరూ తెలుసుకోలేరని అనుగ్రహించింది. ఆ తరువాత ధర్మరాజు యమ ధర్మరాజును ప్రార్ధించాడు. వెంటనే ధర్మరాజుకు సన్యాసి వేషం , భీమునకు వంట వాడి వేషం, అర్జునినికి పేడి వేషం, నకులునికి అశ్వ రక్షకుడి వేషం, సహదేవుడికి పశుపాలకుని వేషం లభించాయి. మీరు అందరూ ఒకరి వెంట ఒకరు వచ్చి నగరంలో ప్రవేశించండి అని చెప్పి ధర్మరాజు ముందుగా కమండలం తీసుకుని పాచికల కట్ట చంకన పెట్టుకుని నగర ప్రవేశం చేసారు. దైవవశాత్తు విరాటరాజు ఆరోజు నగరసంచారం చేస్తున్నాడు. దూరం నుండి సన్యాసి వేషంలో వస్తున్న ధర్మరాజుని చూసి " ఆహా ఏమి ఠీవి, ఏమి రాజసం, రాజ్యాలను ఏలే చక్రవర్తిలా ఉన్నాడు " అనుకుని ధర్మరాజుకు ఎదురు పోయి నమస్కరించాడు.

ధర్మరాజుతో " అయ్యా! మీరెవరు? ఏ ఊరు? మా నగరుకు ఎందుకు వచ్చారు? వివరించండి " అన్నాడు. ధర్మరాజు చిరునవ్వు నవ్వి " నేను బ్రాహ్మణుడను. కురుదేశంలో జన్మించాను. సన్యాసాశ్రమం స్వీకరించాను. నాకు జూదంలో ప్రవేశముంది. శత్రువులు జూదంలో ఓడించి నా సంపదనంతా అపహరించారు. ఆ అవమానం భరించలేక దేశం విడిచి వచ్చాను. నన్ను కంకుభట్టు అంటారు. నేను తమరు సజ్జనులైన మహారాజులని విని వచ్చాను. నేను నీచ వృత్తి చేయను. ఒక సంవత్సరం వ్రతం ఉన్నది . ఆ వ్రతకాలం మీ వద్ద ఉంటాను అనుగ్రహించండి. ఆ తరువాత నన్ను అవమానించిన వారిని వెతుక్కుంటూ వెళతాను " అన్నాడు.

విరాటరాజు " అయ్యా ! తమరు మా రాజ్యంలో ఉండటం కంటే మాకు భాగ్యం లేదు. నాకు జరిగే మర్యాదలు అన్నీ నీకు జరుగుతాయి. తమరు సంతోషంగా మా నగరంలో ఉండండి " అన్నాడు. ధర్మరాజు " నాకు రాజభోగాలతో పని లేదు. నేల మీద నిద్రిస్తాను. హోమం చేయగా మిగిలినది తింటాను " అన్నాడు. విరాటరాజు అందుకు అంగీకరించాడు. ధర్మరాజు కొలువులో ప్రవేశించాడు.