మొదటికే మోసం


నలుగురు వర్తకులు కలిసి సమిష్టిగా దూది వ్యాపారాన్ని ప్రారంభించేరు. దూది -బేళ్ళను ఒక గదిలోవేసి తాళం వేసేవారు వాళ్ళు .కాని, ఆ గదిలోని ఎలుకలు వాటిని పాడుచేస్తూండేవి.

అందుచేత వాటిని అంతం చెయ్యాలని ఒక పిల్లిని పెంచడం మొదలు పెట్టారు వాళ్ళు .ఆ పిల్లి ధర్మమా అంటూ ఎలుకల బాధ తగ్గిపోయింది. దానితో ఆ వర్తకులకు బాభం రావడం మొదలు పెట్టింది. ఆ లాభానికి కారణం పిల్లేనని గ్రహించుకుని ఆ పిల్లి నాదంటే నాదని తరవులాడటం మొదలు పెట్టేరు నలుగురు వ్యక్తులు అలాగ కొంతకాలం తగవులాడిన పిమ్మట వారు ఒక నిర్ణయానికి వచ్చేరు. ఆ పిల్లికి నాలుగు కాళ్ళూ తమ విభేదాన్ని తొలగించడానికే ఇచ్చేడు భగవంతుడనుకొని,ఒక్కొక్క కాలిని ఎంచుకొనిపెంచుకున్నారు. ఎవరి కాలికి వారువారికి తోచిన అలంకారం, సంరక్షణచెయ్యడం మొదలు పెట్టారు. కాళ్ళఅలంకారంతో పిల్లి దిట్టంగాపెరగటం మొదలు పెట్టింది.

ఒక వర్తకుడు తన వంతుకు వచ్చిన పిల్ల కాలికి బంగారవు మువ్వలను కట్టాడు. కొత్త బరువువల్ల పిల్లికాలు బలిసి పుండయింది. అందుచేత అతడు ఆ మువ్వలను తీసివేసి కాలికి నూనె గుడ్డతో కట్టుకట్టాడు.

పూర్వంలాగే దాన్ని గదిలో వదిలిపెట్టి, చీకటి పడగానే ఆ గదిలో దీవం పెట్టి తాళం వేసుకుని వెళ్లిపోయేరు వర్తకులు.
ఆ రాత్రి ఒక ఎలుక ఆ గదిలోకి వచ్చింది. వెంటనే దాన్ని పట్టుకోవడానికి ఆ పిల్లి పరుగెత్తబోయింది. కాని కాలు కుంటి అవడం చేత లక్ష్యం తప్పి దీపం మీద అది పడింది. దాంతో ఆ కాలికున్న నూనె గుడ్డకు దీపం అంటుకుంది. పిల్లికి గాభరా ఎత్తింది. దాంతో అది గది యంతట చిందులు త్రొక్క డం మొదలు పెట్టింది. ఆ చిందులతో అవన్నీ తగులబడి పోయాయి కాలికున్న నిప్పు దూదిబేళ్ళకు అంటుకొని రెండవనాడు ఆ వర్తకులంతా ఘోరాన్ని చూసారు.


దానికి కారణం వారిలో ఒకరు పిల్లికాలికి నూనెగుడ్డ కట్టి కుంటించడమేనని నిర్ధారణ చేసుకుని, మిగిలిన ముగ్గురూ ఆ నాల్గవవాడిని తమకు వచ్చిన నష్టానికి పరిహారం యివ్వమని కోనేరు. "ఇది వాడికి చాలా కష్టమనిపించింది. తన భాపతు సరుకుపోయినందుకే ఏడవాలో, లేక మిగిలిన ముగ్గురకూ వచ్చిన నష్టాన్ని ఇచ్చుకోవడానికి ఏడవాలో తెలిసిందికాదు. వారికి ఏమైనా గాని వాడు అంత మొత్తాన్ని ఇచ్చుకోలేక కొంత యిస్తానని బ్రతిమాలేడు. కాని వాళ్ళు తమ మొత్తాన్ని అణాపైసలతో ఇచ్చుకోవలసిందేనని ఒత్తిడి పెట్టారు.

వాడు ఇప్పుడు లేదనడంతో వాళ్ళు పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేసేరు. పెద్దలు రెండు పక్షాలవారి వాదనలూ శ్రద్ధగా విని అసలు విషయం జాగ్రత్తగా గ్రహించేరు. తరువాత వారీ క్రింది విధంగా తీర్పునిచ్చేరు.
నాలుగవ వర్తకుడికి చెందిన పిల్లి కానికి దెబ్బ తగలడం చేత అది కుంటిది అయిపోయింది. అందువల్ల మిగిలిన మూడుకాళ్ళే పరుగుత్తే స్థితిలో వున్నవి. ఆ కాళ్ళ పరుగువల్లనే నాల్గవ కాలికి కట్టివున్న నూనె గుడ్డకు నిప్పు అంటుకుంది.తరువాత ఆ కాళ్ళే నాల్గవకాలికి అంటుకొన్న నిప్పును దూది బేళ్ళకు అంటించేయి.అదే దూది గిడ్డంగి తగలబడడానికి కారణం మిగిలిన ముగ్గురు వర్తకులూ నాలుగవ వర్తకునికి చెందిన వాటాకు పిల్లి వలన సంభవించిన నష్టానికి పరిహారంఇచ్చుకోవలసిందే అని తీర్పునిచ్చారు.

అది విని ముగ్గురూ "అయ్యో! వాడిస్తానన్న కొద్ది మొత్తానికే అంగీకరిస్తే ఈ చిక్కే వుండేది కాదు గదా! ఇంతకు తగవులాడి తీర్పుకు వెళితే మొదటికే మోసం వచ్చింది" అని మధనపడి, నాల్గనవాడికి సష్ట పరిహారం ఇచ్చుకున్నారు.