పిల్లల తెలివి


ఐదవ తరగతి చదువుతున్న సరోజిని పదేళ్ళ కొడుకు దినేష్ బక్కచిక్కి మందకొడిగా వుండటం చూసి సరోజనికి ఎప్పుడూ దిగులుగా వుండేది. భోజనం కూడా సరిగ్గా చేయక పోవడం వల్ల మరింత దిగులుగా వుండేది. తన కొడుకు అందరి పిల్లల్లాగా తెలివిగా చురుకుగా వుండాలని ఎవరెవరి సలహాల మీదనో ఏవేవో టానిక్కులు, మందులు తెచ్చి ఇచ్చేది.
ఒకసారి ఎవరో ఇచ్చిన సలహా ప్రకారం బలవర్ధకమైన కాయగూరలు, ఆకుకూరలు వండి భోజనంలో వడ్డించి పెట్టింది. వాటిని చూసిన దినేష్ "ఈ ఉడకేసిన కూరలు నేను తిననంటే తినను. నాకు ఇష్టం లేదంతే!" అని ఖచ్చితంగా చెప్పేశాడు.
సరోజని కొడుకుతో "చూడు బాబూ! ఇప్పుడు నువ్వు ఐదోతరగతి చదువుతున్నావు ఈ కాయగూరలు, ఆకుకూరలు ఎటువంటి ఆరోగ్యాన్నిస్తాయో నీకు తెలీదు. వచ్చే సంవత్సరం ఆరోతరగతికి వెళ్తే మీ టీచర్ ఆరోగ్యశాస్త్రంలో వీటి విలువ చెబుతుంది. అది విని నువ్వే ఆశ్చర్యపోతావు
తల్లితో "అమ్మా! వచ్చే సంవత్సరం నేను టీచర్: ద్వారా తెలుసుకుని అప్పుడు తింటాను.' ఇప్పుడు మాత్రం ప్రతిరోజూ వంటలు టీవీలో పిండివంటలలో అంటీలు చేసినట్లుగా నాకిష్టమైన వంటలు చేసి పెట్టు" అన్నాడు దినేష్ సరోజిని ఈ కాలం పిల్లలందరిలాగే తన కొడుక్కి కూడా ఇంత తెలివితేటలు వచ్చాయా? అనుకుని నిర్ఘాంతపోయింది.