ప్రదక్షణ


సుబ్బిశెట్టి వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో చాలామంది అతడి వద్దనుండి అప్పులు తీసుకున్నవారే.
ఒకరోజు రామయ్య అనే రైతు అప్పుకోసం సుబ్బిశెట్టి వద్దకొచ్చాడు. అనావృష్టి వల్ల పంటలు పండక, కుటుంబ పోషణకు తప్పనిసరి పరిస్థితిలో అప్పు చేయాల్సి వచ్చింది రామయ్యకు.
"నీకిప్పుడు జ్ఞాపకం వచ్చానన్నమాట. ఈ ఊర్లో ఎందరికో అప్పులిచ్చాను. నాళ్లువచ్చి నన్ను పలకరించిపోతుంటారు. కానీ నీవెప్పుడూ నాతో మాట్లాడిన పాపాన పోలేదు. పొగరుతో నా అవసరం ఏమిటీలే అనుకున్నావు ఇప్పుడు నా కాళ్ల దగ్గరకొచ్చావు" అని హేళనగా మాట్లాడాడు సుబ్బశెట్టి.
అవసరం తనది కాబట్టి సుబ్బశెట్టి ఎన్ని మాటలు ఆడినా రామయ్య మౌనం వహించాడు. అలా నాలుగైదు రోజులు తనచుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత రామయ్యకు కొంతడబ్బు అప్పు ఇచ్చాడు సుబ్బిశెట్టి.
ఇదంతా గమనిస్తున్న ఓ వ్యక్తి "ఏం రామయ్య! అవ్వకోసం అన్నిసార్లు ప్రదక్షణ చేయడం సిగ్గుగాలేదు?" అని అడిగాడు.

"నేను నాలుగైదు రోజులే తిరిగాను కాని నాలుగైందు సంవత్సరాలు నా చుట్టూ అతను ప్రదక్షణ చేస్తూనే వుంటాడు. బాకీ చెల్లించమని!" అన్నాడు సంతోషంగా రామయ్య.