శంఖ చూడుని కథ



"మహారాజాః యీ కథ కూడ ఆలకించి నా అనుమానం తీర్చు- అదేమిటంటే:- పూర్వం జీమూతకేతువనే విద్యాధర రాజు ఉండేవాడు. అతనికి కోరిన కోరికలను తీర్చు "కల్పవృక్షం" కూడా ఉండేది. ఆ కల్పవృక్ష మహిమవలన అతడు తన రాజ్య ప్రజలకు ఎన్నో శుభములను కలిగించేవాడు. అందుచే ప్రజలు అందరు అతనికి ఎంతో వినయముగా ప్రవర్తించుచుండేవారు.

జీమూతకేతువునకు చాలకాలమున విష్ణునరప్రసాదమున "జీమూత వాహనుడు" అను కుమారుడు జన్మించెను. ఆ జీమూతవాహనుడు క్రమక్రమంగా దినదిన ప్రవర్ధమానుడై, రాకా సుధాకరుని రీతి వృద్ధి పొందుచు యుక్తవయస్సు గల వాడయ్యెను. తండ్రి కుమారుని యొక్క మంచి గుణములను గాంచి ఎంతో సంతోషించెడువాడు. జీమూతవాహను "సర్వప్రాణులు దుఃఖములేక ఆనందంగా ఉండాలని" సదా కోరుతుండేవాడు.

కొంతకాలంను జీమూతకేతువు సూరుడగు జీమూత వాహనునికి విద్యాధర రాజ్యము పట్టాభిషేకము చేసి, తపస్సు చేసికొనుటకు, భార్యతోసహా వనంలకు వెళ్ళిపోయాడు.

జీమూత వాహనుని యొక్క అహింసా మార్గమును కనిపెట్టిన శత్రు రాజులు కొందరు ఏకమై విద్యాధర రాజ్యంపైకి దండెత్తి వచ్చారు. జీమూత వాహనుడు అఖిల శస్త్రాస్త విద్యలయందును నిపుణుడే. కానీ ప్రాణహింస సహించని స్వభావము కలవాడు. అందరూ ఆనందంగా ఉండాలనే కోరిక గలవాడు కావున, శత్రువులను జయించు శక్తి గలవాడయ్యను, యుద్ధమునకు పూనుకొనక రాజ్యంను వారికి అప్పగించి వేశాడు. కల్పవృక్షమును ప్రార్థించి - తన రాజ్య ప్రజలందరికి సువర్నమును ప్రసాదింపజేసినాడు.

మహా మహిమగల అ కల్పవృక్షము జీమూత వాహనుని ప్రార్థన మేర ఆతని రాజ్యమెల్ల కనకవర్షం వరించింది. ప్రజలు ఐశ్వర్యవంతులయ్యారు. కల్పవృక్షం స్వర్గంకు వెళ్ళగా అరణ్య పురములో మలయ పర్వత ప్రాంతంను చేరుకొన్నాడు. శాంతియుతంగా జీవితం గడుపుకొనుచున్నాడు.

ఆ మలయగిరి ప్రాంతమంతయు విశ్వావసు అను సిద్ధునికి చెందినది. విశ్వావసునకు "మిత్రావసును" అను కుమారుడును, "మలయవతి” అను కుమార్తెయు నుండిరి.

మలయగిరి ప్రాంతమందే చిన్న ఆశ్రమమేర్పరచుకొని యున్న జీమూతవాహనుకి, మిత్రావసువునకు స్నేహం ఏర్పడినది. ఆ స్నేహం క్రమ క్రమంగా వృద్ధిచెందినది. అది కారణంగా కొన్ని రోజులకు మిత్రావసుపు తండ్రిని ఒప్పించి, తన చెల్లెలను "మలయవతి "ని జీమూతవాహనుకి యిచ్చి వివాహం గావించాడు.

మలయవతి గౌరీదేవి భక్తురాలు, సదా పార్వతీదేవిని ప్రార్థించెడిది. గౌరీదేవికి నిత్యపూజలు జరిపి. నైవేద్యం పెట్టినగాని తాను భుజించెడిది కాదు. పార్వతీదేవియు, మలయవతిని అనేక విధముల కంటికి రెప్పవలె కాచి, కాపాడుచుండెడిది.

బావమరదులు (మిత్రావసువు- జీమూత వాహనులు) ఒకనాడు సాయం కాలం షికారుగా బయలు దేరి మలయగిరి పర్వతముల మీదికి వచ్చిరి. అచ్చట జీమూతవాహనునికి ఒక ఎముకల రాశి , మిల మిల మెరయుచు, వెండిపొర గప్పిన దానివలె కన్పించింది. దానిని జూచి జీమూతవాహనుడు "బావా: ఆ ఎముకలరాశి ఏమిటి? అంత పెద్దయెత్తున పడియున్నది? అది యేమిటో, ఎందులకిట్లున్నదో తెలియునా? ఈ రాశి యంతయు నాగుల (పాముల) యొక్క ఎముకలవలెనే కన్పించుచున్నది" అని ప్రశ్నించెను. మిత్రావసువు ఆ మాట లాలకించి, "బావా: అది ఒక పెద్దకథ గరుత్మంతుని క్రోధానికి ఆహుతియైన నాగుల యొక్క ఎముకల రాశియే అది" అని పలికెను.

"నీకు తెలిసినంతవరకు ఆ కథ వినిపించు బావా:" అని జీమూత వాహనుడు అడిగాడు. మిత్రావసును ఆ సర్పదాళి యొక్క కథ యిలా వివరించాడు.