తిలకాష్ట మహిష బంధం

పూర్వంలో, మామూలు యుద్ధాలే కాక, సాహిత్య యుద్ధాలు కూడా జరుగుతుండేవి. కృష్ణదేవరాయల కాలంలో అవి అధికంగా ఉండేవి. సాహితీ పరమయిన విజయమూ, అపజయాలూ కూడా రాజులకు అతిప్రధానమే. అష్టదిగ్గజాలు, (అంటే ఎనిమిదిగురు గొప్పకవులు) భువనవిజయం, (కళావేదిక) కలిగియున్న హంపీ విజయనగర రాజ్యాన్ని జయించాలని వచ్చే పండితులు ఎంతమందో!

శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా ఆముక్తమాల్యద రచించిన కవి. రాజే కవికావడంతో సాహిత్య దండయాత్రలు ఎక్కువగా జరిగేవి. అలాగ ఒకరోజు రాయల ఆస్థానంలో ఉండగా భటుని ద్వారా ఒక లేఖ వచ్చింది. దాని సారాంశం యిది:

“నా పేరు భైరవభట్టు. కాశ్మీరు బ్రాహ్మణుడను. వేదవేదాంగములు అభ్యసించి ఆపోశనము పట్టినవాడను. దేశదేశాలు పర్యటిస్తూ ఆస్థానకవులను నా పాండిత్య ప్రతిభతో ఓడించి జయపతాకములందుకొనుచూ వచ్చుచున్నాను. తమ కొలువులో ఎవరయినా పండితులున్నచో వారితో శాస్త్రవాదమునకు నేను సంసిద్ధంగా ఉన్నాను. నాతో వాదించుటకు ముందుకురాగల పండితులెవరైనా తమ ఆస్థానమున లేనిచో నాకు విజయపత్రికను ఇచ్చేయండి” అన్నాడు.

రాయలు ఆ పండితుని సభలోకి తోడ్కొని రమ్మని భటుడిని పంపారు. అతడు రాగానే, గుసగుసలాడుచున్న పండితుల నడుమనుంచి రామకృష్ణుడు లేచి, భైరవభట్టు వైపూ రాయలవైపూ సభవైపూ కలయజూస్తూ,

“శాస్త్ర వాదములు జరుగకుండా విజయపత్రికను ఊరకనే యిచ్చే ఆచారమేదీ ఈ సంస్థానమునకు లేదు. వాదనలకు నేను సిద్ధమే” అని ప్రకటించాడు. సభను మరునాటికి వాయిదా వేశారు రాజు. రామకృష్ణుడు భైరవభట్టు బస ఎక్కడో తెలుసుకుని, ఆ సాయంత్రం మారువేషంలో భైరవభట్టుని పలకరించడానికి చంకనమూటతో వెళ్లాడు.

“కాశ్మీరమునుండి ఎవరో మహాపండితులు విచ్చేశారని విని దర్శనం చేసుకుపోదామనివచ్చాను. ఆ పండితమాన్యులు తమరేనా? తమ నామధేయం?” అంటూ నమస్కరించాడు.

“నేనే. నా పేరు భైరవభట్టు. నువ్వెవరవు? నీ చంకన ఉన్నదేమిటి?” అడిగాడు పండితుడు.

“అయ్యా! నేనొక విశ్వకర్మను. కాలక్షేపము కోసం కావ్యములు చదువుచుందును. మా గురువుగారు తెనాలి రామకృష్ణులు. వారినడిగి యీ గ్రంథమును తెచ్చుకొనుచున్నాను. ఈ మూటలో ఆ గ్రంథమే” అన్నాడు అతివినయంగా. “ఆ గ్రంథము పేరు?” అడిగాడు ఖైరవభట్టు.

“తిలకాష్ట మహిషబంధం.” చెప్పాడు మారువేషంలోనున్న రామలింగడు. “ఆ!” నివ్వెరపోయాడు ఖైరవభట్టు. “జెన్సు, తిలకాష్ట మహిషబంధమే. ఆశీర్వదించండి శెలవు...” అని అతను వెళ్లిపోయాడు.

ఆ కశ్మీరు పండితునకేమీ తోచలేదు. తిలకాష్ట మహిషబంధమను గ్రంధమొకటున్నట్లే తనకి తెలియదు, అదీకాక ఒక సామాన్య విశ్వకర్మే యిటువంటి అసాధారణ కావ్యమును కాలక్షేపముగా చదువుచున్నాడనిన, రాయలవారి ఆస్థానములో ఎంతటి ఉద్దండ కవులుండెదరో! ఈ విశ్వకర్మ గురువు ఇంకెంతటి మహాపండితుడో? వారితో వాదనకు దిగినచో నేను నిశ్చయముగా పరాభవము నెదుర్కోవలసి వచ్చును. ఆ కర్మ ఎందులకు? అనుకుంటూ ఆ రాత్రి ఎవరికీ తెలియకుండా ఆ వూరి నుంచి ఉడాయించేశాడు.

మరునాడు రాయలవారు సమయము దాటిపోతున్ననూ ఆ కశ్మీరు పండితుడు భైరవభట్టు సభకు రాడేమిటి?” అని అడుగగా రామకృష్ణుడు జరిగినది చెప్పెను. “ఇంతకీ, రామకృష్ణా! ఆ మూటలోని తిలకాష్ట మహిషబంధమను గ్రంథము సంగతేమిటి?” అడిగాడు రాజు.

“అది గ్రంథముకాదు ప్రభూ. అసలు అలా౦టి పేరుతో ఏ గ్రంథమూలేదు. తిల అంటే నువ్వులు, కాష్ట అంటే కర్రలు, మహిష అంటే దున్నపోతు, బంధము అంటే కట్టుతాడు. తిలకాష్టమహిషబంధమంటే - నువ్వుల కట్టెలను దున్నపోతుకు కట్టుతాడు. ఆ మూటలోనిదదే” అన్నాడు రామకృష్ణుడు. రాయలతో సహా సభలోనివారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు.