యమధర్మరాజు సత్యవంతుని ప్రాణములు తీసుకువెళ్ళుట



సావిత్రి భర్తతోపాటు నార చీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తుంది. సంవత్సరం గడవటానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంది. సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంది. ఆఖరి రోజు ఉదయమే స్నాదికాలు ముగించి అత్త మామలకు నమస్కరించింది. యదావిధి అందరికి సేవ చేసింది. సావిత్రితో భర్త " సావిత్రీ! నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకు వస్తాను " అని అన్నాడు. సావిత్రి భర్తను అడిగి నేను మీ వెంట వస్తానని అతని వెంట బయలుదేరింది.

అడవిలో అందాలు చూస్తునే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో మార్పులు గమనిస్తూ ఉంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతున్నాడు. ఇంతలో తల భారంగా ఉందని గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చున్నాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకుని అతనికి సపర్యలు చేస్తూ ఉంది. కొంత సేపటికి సత్యవంతుడు స్పృహకోల్పోయాడు.

ఇంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రములు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడు చేతిలో పాశం ధరించిన వాడు అయిన దేవతా మూర్తి అక్కడికి వచ్చాడు. అతనిని చూసి సావిత్రి " అయ్యా ! మీరెవరు? " అని అడిగింది. " సావిత్రీ! నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. నేను ఇతరులకు కనబడను. నీ భర్త సత్యవంతునికి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్య పురుషుడు. అందుకే అతని ప్రాణములు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను " అని పలికి యమధర్మ రాజు తన పాశమును సత్యవంతునపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగాడు. వెంటనే దక్షిణ దిక్కుకు పయనమయ్యాడు.

సావిత్రి తన భర్త దేహమును ఎవరికి తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మ రాజుని అనుసరించింది. తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి " అమ్మా! నీవు ఎందుకు నా వెంట వచ్చావు. ఇంక మీదట ఈ దారి వెంట రాలేవు " అని పలికాడు. సావిత్రి " యమ ధర్మరాజా! భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళటం భార్యల ధర్మం కదా. నీ దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా? మార్గములలో ధర్మమార్గం ప్రధానం. ధర్మమునకు ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ వృధా కాదు.

నీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభములు పొందక నేను మామూలు మనిషి వలె ఎలా వెనుకకు పోగలను " అని పలికింది సావిత్రి. ఆమె మాటలకు యమ ధర్మరాజు ఆశ్చర్యపోయి " అమ్మా! నీ మాటలకు మెచ్చాను. నీ భర్త ప్రాణములు తప్ప ఒక వరం కోరుకో ఇస్తాను " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా ! నా మామగారు సాళ్వరాజుకు కంటి చూపులేదు. అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి " అని కోరింది. యమధర్మరాజు " అలాగే నీ మామగారికి చూపు ప్రసాదించాను దీనితో తృప్తి పడి మరలి పో " అన్నాడు.

సావిత్రి యమధర్మరాజుని వెంబడించింది. " కాని యమధర్మరాజా ! మనస్సు, వాక్కు, కర్మలతో ఎవరికి కీడు తలపెట్టకుండా ఉండుట, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట ఆర్య ధర్మములు అని మీకు తెలియును కదా. నీవు ధర్మదేవతవు నీకు తెలియనిది ఏమున్నది. అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తీ అంటారు కదా నిన్ను యముడు, శమనుడు అని పిలుస్తారు కదా " అని పలికింది సావిత్రి. యమ ధర్మరాజు " అమ్మా! సావిత్రి నీ మాటలు అమృతోపమానము ఇకొంక వరం కోరుకొనుము " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి " అని కోరింది.

యమ ధర్మరాజు " అలాగే నీవు కోరినట్లు వరం ఇస్తాను. ఇంక నిలువుము. ఇక్కడి నుండి నీవు రావటానికి లేదు " అని అన్నాడు. సావిత్రి " ఓ ధర్మరాజా! నీకు తెలియనిది ఏమున్నది. ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడువరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం కనుక నేను ఎలా విడిచేది " అని పలికింది. యమధర్మరాజు " సావిత్రీ ! నీ ధర్మ బుద్ధికి మెచ్చాను. మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణములు తప్ప " అన్నాడు.

సావిత్రి " యమ ధర్మరాజా! నా తండ్రి అశ్వపతికి పుత్రసంతతి లేదు. ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహింపుము " అని కోరింది. యమధర్మరాజు " అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసి పోయావు ఇక వెనుకకు మరలుము " అన్నాడు. సావిత్రి " యమ ధర్మరాజా! సతికి భర్త సేవయే పరమార్ధం. నా మనస్సు నా భర్త పాదసేవలో లగ్నమైంది. నాకు అలుపెక్కడిది.

తన ధర్మం తప్పక చరించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మ నిష్ఠతోనే సూర్య చంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు అవుతారు అని అంటారు నేను మీతో ఎన్నో మాటలాడాను. ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను. కనుక నా కోరికను మన్నించుము " అని అడిగింది. అందుకు యమధర్మరాజు సంతోషించి " సావిత్రీ! నీకు మరొక వరం ఇచ్చెదను కోరుకొనుము " అని చెప్పాడు. అందుకు సావిత్రి " యమధర్మరాజా! ఇప్పటి దాకా నువ్వు ఏ వరం కోరుకొమ్మన్నా నీ పతి ప్రాణములు దక్క అన్నావు. ఇప్పుడు ఆ మాట చెప్పలేదు కనుక నా ఇష్టం వచ్చిన వరం కోరుకుంటాను.

యమధర్మరాజా! సతికి పతియే దైవము. పతి లేని జీవితం సతికి దుర్భరం. ఏ శుభ కార్యానికి ఆమెను పిలువరు. కనుక సాళ్వభూపతి తనయుడైన సత్యవంతుని పునరుజ్జీవుని చేయుము " అని కోరింది. ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుని అతడి శరీరంలో ప్రవేశ పెట్టాడు. యమధర్మరాజు సావిత్రితో " సావిత్రీ! నీ భర్త నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తాడు. నీకు నూరుగురు కుమారులు కలుగుతారు. నీవు కీర్తిమంతురాలవు అవుతు" అని చెప్పి వెడలి పోయాడు.